ఇన్ఫోసిస్ సీక్రెట్లు బయటపెట్టిన విశాల్ సిక్కా: అంచనాలను మించిన లాభాలు
తమ కంపెనీకి సంబంధించిన కీలక విషయాలను బయటపెట్టారు ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా. భవిష్యత్తులో తమ కంపెనీ ఆదాయ వృద్ధి కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు తెలిపారు.
న్యూఢిల్లీ: తమ కంపెనీకి సంబంధించిన కీలక విషయాలను బయటపెట్టారు ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా. భవిష్యత్తులో తమ కంపెనీ ఆదాయ వృద్ధి కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు తెలిపారు. వీటిలో రోబోటిక్స్, ఏఐ, డ్రైవర్ లెస్ కార్లు ప్రధానమైనవని సిక్కా వెల్లడించారు.
కొత్త టెక్నాలజీ..
జూన్ క్వార్టర్ ఫలితాల సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైసూరులో ఉన్న సంస్థ ఇంజినీరింగ్ సర్వీసెస్లో పూర్తిగా డ్రైవర్ లెస్ కార్ల అభివృద్ధికే కేటాయించినట్లు తెలిపారు. అంతేగాక, తాము ట్రాన్సర్మేటివ్ టెక్నాలజీలను కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
వీటితోనే లాభాలు..
డ్రైవర్ లెస్ కారుపైనే తమ దృష్టి ఎక్కువగా ఉందని సిక్కా తెలిపారు. తమ రెవెన్యూలో 10శాతం కొత్త టెక్నాలజీలు, సర్వీసుల నుంచే వచ్చాయని కూడా వెల్లడించారు. తాము రెవెన్యూలు ఆర్జించిన ఈ సర్వీసులు, టెక్నాలజీలు రెండేళ్ల క్రితం అసలు మార్కెట్లో లేనే లేవని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాము ఎక్కువగా వీటిపై దృష్టి సారించినట్లు తెలిపారు.
Recommended Video
ఆర్టిఫియల్ ఇంటెలీజెన్స్..
స్వతంత్ర, అనుసంధాన వాహనాలకు అంతర్జాతీయంగా పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ సామర్థ్యాలను ప్రదర్శిస్తామని సిక్కా వివరించారు. ఆర్టిఫియల్ ఇంటెలీజెన్సీ, వ్యాపార అవకాశాల ప్రాజెక్టులలో పని చేసే సామర్థ్యమున్న వేలకొద్ది ఇంజినీర్లను సృష్టిస్తున్నట్లు కూడా తెలిపారు.
అంచనాలను మించిన ఇన్ఫీ లాభాలు
ఇది ఇలా ఉండగా, శుక్రవారం ఉదయం ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ విశ్లేషకుల అంచనాలను స్వల్పంగా మించాయి. రూ. 3,429కోట్లు మేర లాభాలు వస్తాయని అంచనా వేసినప్పటికీ.. ఈ ఫలితాల్లో ఇన్ఫోసిస్ కంపెనీ నికర లాభాలు రూ. 3,483 కోట్లను నమోదు చేయడం గమనార్హం.ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నికర లాభం 1.3శాతం పెరిగి.. రూ.3,483కోట్లకు చేరింది. ఇక సంస్థ ఆదాయం కూడా 1.7శాతం పెరిగి రూ.17,078కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంస్థ ఆదాయం రూ.16,782కోట్లు మాత్రమే.
డ్రెవర్ లెస్ వాహనంలో చక్కర్లు
కాగా, విశాల్ సిక్కా శుక్రవారం తన కార్యాలయానికి ప్రత్యేక వాహనంలో వచ్చారు. తమ కంపెనీ ఇంజినీర్లు తయారు చేసిన డ్రైవర్రహిత కారులో సిక్కా, కంపెనీ సీవోవో ప్రవీణ్ రావ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని సిక్కా తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. మైసూరుకు చెందిన ఇన్ఫోసిస్ ఇంజినీర్లు ఈ డ్రైవర్రహిత వాహనాన్ని తయారు చేశారని, మనం ఇలాంటివి తయారు చేయలేమని ఎవరు అన్నారని సిక్కా ట్వీట్ చేశారు. కాగా, కంపెనీ ఆవరణలో ఉద్యోగులు కూడా ఈ డ్రైవర్రహిత కారులో ప్రయాణిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.