విశాల్ సిక్కా రాజీనామా ఎఫెక్ట్: పాతాళానికి పడిపోయిన ఇన్ఫోసిస్ ఈక్విటీ
ఇన్ఫోసిస్ కు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న డాక్టర్ విశాల్ సిక్కా రాజీనామా చేశారన్న వార్త తెలియగానే సంస్థ ఈక్విటీ విలువ పాతాళానికి పడిపోయింది.
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ కు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న డాక్టర్ విశాల్ సిక్కా రాజీనామా చేశారన్న వార్త తెలియగానే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా, సంస్థ ఈక్విటీ విలువ పాతాళానికి పడిపోయింది.
ఇన్ఫోసిస్లో సంచలనం: విశాల్ సిక్కా అవుట్! మూర్తి వస్తారా? చక్కదిద్దుతారా?
ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన క్షణాల వ్యవధిలోనే కిందకు జారిపోయిన ఇన్ఫోసిస్ ఈక్విటీ, ఉదయం 9:55 గంటల సమయంలో 7 శాతానికి పైగా నష్టంలో కొనసాగుతోంది.
ఇటీవలి కాలంలో తొలిసారిగా సంస్థ ఈక్విటీ విలువ రూ. 950 స్థాయి వద్ద మద్దతు కోల్పోయింది. ప్రస్తుతం సంస్థ వాటా విలువ రూ. 946 వద్ద కొనసాగుతోంది. సిక్కా రాజీనామా నిర్ణయం ఇన్ఫీపై పెను ప్రభావాన్నే చూపిందని మార్కెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇక బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 0.7 శాతం పడిపోయి 31,574 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇన్ఫీ ప్రభావంతో ఐటీ ఇండెక్స్ భారీ నష్టాల్లో సాగుతోంది.