నిపుణుల వేటలో ఇన్ఫోసిస్: సిలికాన్ వ్యాలీపై కన్ను
బెంగళూరు: భారతదేశంలోని రెండో అతిపెద్ద సాప్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుతం భవిష్యత్పై దృష్టి సారిస్తోంది. కంపెనీ కొత్తగా చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్లాట్ ఫాం 'మన'ను విజయవంతం చేయడానికి, ఉత్పత్తులను అభివృద్ధి చేయడం కోసం ప్రపంచంలో టెక్ దిగ్గజాల పుట్టినిల్లు సిలికాన్ వ్యాలీ నిపుణులను ఇంఛార్జ్లుగా నియమించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
సిలికాన్ వ్యాలీలో కంపెనీ ప్రొడక్ట్ లను, ప్లాట్ఫాం బృందాలను పెంచుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించామని ఇన్ఫోసిస్ ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీ అధినేత నవీన్ బుధిరాజా ఎకనామిక్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఎక్స్ పర్ట్ ట్రాకింగ్ ప్రొగ్రామ్ ద్వారా ప్రత్యేక సూపర్ కోడర్స్ టీంను రెండింతలు చేసుకున్నామని వెల్లడించారు. ఈ టీంను మరింత పెంచుకోనున్నామని తెలిపారు. ఈ ప్రోగ్రాం ద్వారా కొత్త ప్రాంతాల్లో టెక్నాలజీని అభివృద్ధి చేసి ఆదాయాలను పెంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపారు.
కంపెనీ క్లౌడ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అధినేత సామ్సన్ డేవిడ్ను ఎక్స్పర్ట్ సర్వీసుల టీంకు అధిపతిగా నియమించినట్టు తెలిపారు. ఇన్ఫోసిస్ కొత్తగా చేపట్టిన సాప్ట్ వేర్ ప్లాట్ ఫాం 'మన' లాంటి వాటిని విజయవంతం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషిస్తారని కంపెనీ ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కంపెనీలో నెలకొన్న చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఔటో సోర్సింగ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్టులను ఇది నిర్వహిస్తుందని తెలిపారు. బిగ్ డేటా ప్లాట్ ఫాం, ఆటోమేషన్ ప్లాట్ ఫాం, మేథస్సు చుట్టూ తాము చేస్తున్న పనిని 'మన' ప్రొగ్రామ్ ఓ ఉన్నతస్థితికి తెస్తుందని బుధిరాజా ఆశాభావం వ్యక్తం చేశారు.