కేజ్రీపార్టీ నేత ముఖంపై ఇంక్ దాడి, ఇవి తప్పవని వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత యోగేంద్ర యాదవ్ ముఖం పైన ఓ వ్యక్తి సిరా చల్లాడు. శనివారం ఎఎపి నిర్వహించిన సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. సభకు హాజరైన యోగేంద్ర మీడియాతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి ఓ గుర్తు తెలియన వ్యక్తి వచ్చి యాదవ్ ముఖంపై ఒక్కసారిగా సిరా పోశాడు.
ఆ తర్వాత వెంటనే భారత్ మాతాకీ జై అంటూ నినదించాడు. ఈ ఘటనతో అక్కడున్న పార్టీ కార్యకర్తలు కోపోద్రిక్తులయ్యారు. ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. పరిస్థితి మరింత అదుపు తప్పకముందే పోలీసులు జోక్యం చేసుకుని, అతన్ని అక్కడి నుంచి తరలించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఎఎపి టోపీ, బ్యాడ్జీ ధరించిన ఆ యువకుడు ముఖంపై సిరా పోశాడు. అతడిని పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్కు పోలీసులు తరలించారు. షాలిమార్ బాగ్కు చెందిన సాగర్గా గుర్తించారు.
కాగా, హర్యానాలోని గుర్గావ్ నుంచి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎఎపి తరఫున యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. మీతో మాట్లాడుతున్నప్పుడు వెనుక నుంచి వచ్చి ఆ వ్యక్తి నా ముఖంపై సిరా పోశాడని, తాను అతన్ని చూడలేదని, ఈ దేశంలో శక్తివంతులపై పోరాడుతున్నప్పుడు దానికి కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, వ్యాఖ్యానించారు. ఏమైనప్పటికీ తనపై దాడి చేసిన ఆ వ్యక్తిని భగవంతుడు క్షమించాలని కోరుకున్నారు.