కేజ్రీవాల్పై యువతి సిరా దాడి: ఎవరామె?
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిఅరవింద్ కేజ్రీవాల్పై ఓ యువతి సిరా దాడికి పాల్పడింది. ఢిల్లీ రోడ్లపైకి ఒకరోజు సరి సంఖ్య గల వాహనాలను, మరో రోజు బేసి సంఖ్య గల వాహనాలను అనుమతిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం విజయవంతం కావడంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలియడానికి ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన సభలో ఈ సంఘటన జరిగింది.
సభలో కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా సుమారు 20 ఏళ్ల వయసున్న ఆ యువతి అతని ముందున్న స్టాండ్ వద్దకు చేరుకుంది. తర్వాత కొన్ని పత్రాలను ఆయనకు చూపించింది. ఆ తరువాత కొద్దిసేపటికి ముఖ్యమంత్రిపై సిరా పోసింది. కొన్ని సిరా చుక్కలు ముఖ్యమంత్రి మీద పడ్డాయి.
ఆయన ముందున్న స్టాండ్పై కూడా సిరా మరకలు కనిపించాయి. ఈ హఠాత్మరిణామానికి విస్తుపోయిన పోలీసులు వెంటనే తేరుకొని ఆ యువతిని అక్కడి నుంచి పక్కకు లాక్కెళ్లారు. అయితే, ఆ యువతి వద్ద ఉన్న పత్రాలను స్వీకరించి, ఆమెను వెళ్లిపోనివ్వాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు.
ఈ సంఘటనతో ముఖ్యమంత్రి ప్రసంగానికి కొంతసేపు అంతరాయం కలిగింది. సుమారు ఏడు నిమిషాల అంతరాయం తరువాత కేజ్రీవాల్ తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రసంగం ముగిసిన తరువాత తనపై సిరా చల్లిన యువతి సమస్యలను పరిశీలించి, పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఆ యువతిని భావనా ఆరోరాగా గుర్తించారు. ఆమె ఆమ్ ఆద్మీ సేనలో పనిచేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి చీలి ఏర్పడిన సంస్థ అది. ఆమెకు వివాహం కాలేదు. రోహిణిలోని రమా విహార్లో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది.
ఆమె అరెస్టుకు పోలీసులు మెజిస్ట్రేట్ అనుమతి కోరారు. సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయడానికి మెజిస్ట్రేట్ అనుమతి అవసరం. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సంఘటన భద్రతా లోపాన్ని బయటపెడుతోందని ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఢిల్లీ పోలీసులపై విరుచుకుపడ్డారు. సిరాకు బదులు యాసిడ్ పోస్తే ఏం చేసేవారని ఆయన అడిగారు. దాడి చేసిన తర్వాత యువతి టీవీ చానెళ్లతో మాట్లాడిందని, అయినా అరెస్టు చేయలేదని ఆయన అన్నారు. ఇది పోలీసుల కుట్ర అని ఆయన ఆరోపించారు. ఇందులో బిజెపి కుట్ర కూడా ఉందని ఆయన అన్నారు.
అటువంటి దాడులను తాము అంగీకరించబోమని బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ అన్నారు. అయితే ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న నిస్పృహకు ఇది అద్దం పడుతోందని ఆయన అన్నారు. పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలను ఖండించారు.
సోమవారం యువతి అరెస్ట్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఆదివారం సిరా దాడి చేసిన యువతిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆమెపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అమలు చేసిన సరి-బేసి విధానం విజయవంతం కావడంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో కేజ్రీవాల్పై భావన అరోరా అనే 26ఏళ్ల యువతి సిరాతో దాడి చేసింది.