పౌరసత్వ సరవణ బిల్లు: 3 రాష్ట్రాల ఇన్నర్లైన్ పర్మిట్ ఏరియాలకు మినహాయింపు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు పరిధి నుంచి కొన్ని ప్రాంతాలకు మినహాయింపు కల్పించింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాంలలోని ఇన్నర్ లైన్ పర్మిట్ ఏరియాలకు ఈ బిల్లు వర్తించదు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో పేర్కొన్న ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలకు కూడా ఈ బిల్లు రక్షణ కల్పించింది.
రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చిన అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపులకు, బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్, 1873 ప్రకారం నోటిఫై చేసిన ఇన్నర్ లైన్ క్రిందకు వచ్చే ప్రాంతాలకు ఈ సెక్షన్లో ఉన్నదేదీ వర్దించదని ముసాయిదా బిల్లు పేర్కొంది.
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నవారు ప్రధానంగా 6వ షెడ్యూల్, ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రాంతాల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 6ఏకు ఈ నిబంధనను జత చేశారు. గతంలో లోక్ సభలో ప్రతిపాదించిన పౌరసత్వ సవరణ బిల్లులో 6వ షెడ్యూల్, ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రాంతాలకు ఈ రక్షణ లేకపోవడం గమనార్హం.
భారత పౌరులు కొన్ని రాష్ట్రాల్లోని రక్షిత ప్రాంతాల్లో ప్రయాణించేందుకు భారత ప్రభుత్వం జారీ చేసే అధికారిక ప్రాయణ ధృవపత్రాన్ని ఇన్నర్ లైన్ పర్మిట్ అని పేర్కొంటారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ల నుంచి భారతదేశంలోకి 2014 డిసెంబర్ 31 నాటికి ప్రవేశించిన హిందూ, సిక్కు, జైన, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించబోమని ఈ బిల్లు పేర్కొంది.
కాగా, ఈ పౌరసత్వ బిల్లును వచ్చే వారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, పౌర సమాజం ప్రతినిధులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన తర్వాత ఈ బిల్లును రూపొందించడం గమనార్హం.