అక్కడ వినూత్న ప్రయోగం .. ఇంటికే సరుకులు ..100 రూపాయలకే 12 రకాల కూరగాయలు
కరోనా వైరస్ ప్రబలకుండా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంది. ప్రజలు ఎవరూ ఇళ్లనుంచి అడుగుబయటపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా సరే కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది . ఇక లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు నిత్యావసరాల కోసం మినహాయించి బయటకు రావద్దని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి . కానీ ప్రజలు నిత్యావసరాల వంకతో రోడ్లమీద తిరుగుతున్నారు. ఇక నిత్యావసరాల కోసం కూడా గుంపులు గుంపులుగా మార్కెట్ లకు వెళుతున్నారు. సామాజిక దూరం పాటించాలని ఎంత చెప్పినా చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే అన్న చందంగా తయారైంది పరిస్థితి .
Recommended Video
అడవిలో వదిలేస్తే కుక్క చావు చస్తారు .. వారిపై రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు
తమిళనాడులో వినూత్న ప్రయోగానికి శ్రీకారం
ఇక ఇది ఇలా ఉంటే నిత్యావసరాలు దొరక్క కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచే కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో కూడా సరుకులు దొరకని స్థితి నెలకొంది.. ముఖ్యంగా నిత్యవసర వస్తువులైన కూరగాయలు, పాలు, పండ్లు ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేయాలంటే అవస్థలు పడుతున్నారు. అయితే ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తమిళనాడులో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలకు ఇళ్లకే సరుకులు అందించాలని నిర్ణయం
ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో 411కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా వ్యాప్తిని కంట్రోల్ చెయ్యటం , అలాగే ప్రజలకు నిత్యావసరాలను అందించటం లక్ష్యంగా పెట్టుకున్న తమిళనాడు సర్కార్ ప్రస్తుత పరిస్థితులను అధిగమించటానికిఒక కొత్త ఆలోచన చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు బయట తిరగకుండా, అలాగే ప్రజల సౌకర్యార్ధం తమిళ సర్కార్ నిర్ణయం తీసుకుంది . నిత్యావసరాలు , కూరగాయలు ప్రతి ఇంటికి చేరే విధంగా ప్లాన్ చేసింది . రూ.100లకే కూరగాయల ప్యాకేజ్ పంపిణీని ప్రారంభించింది. ముఖ్యంగా కోయంబత్తూర్ మార్కెట్లో ప్రజల రద్దీని తగ్గించేందుకు, కరోనా వ్యాప్తి చెందకుండా ఆపేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం రూ.100లకే 12 రకాల కూరగాయల ప్యాకేజ్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
రూ.100లకే 12 రకాల కూరగాయల ప్యాకేజ్ పంపిణీ
రూ.100లకే 12 రకాల కూరగాయల ప్యాకేజ్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి ఎస్పీ వేలుమణి. కూరగాయలు , నిత్యావసరాలు సరఫరా సందర్భంగా , కోవై కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్లో వ్యాన్ల ద్వారా ఈ ప్యాకేజ్లను ప్రజల ఇళ్ల వద్దకే చేరుస్తామని చెప్పారు మంత్రి . మరో ప్యాకేజ్ కావాలంటే మరో వంద రూపాయలు చెల్లించాల్సిందిగా తెలిపారు. మొత్తానికి నిత్యావసరాలు, కూరగాయలు ఇంటికే వెళ్లి విక్రయిస్తామని చెప్పిన, ప్రజలందరికీ నిత్యావసరాలు అందించటమే తమ లక్ష్యమని చెప్తున్న తమిళనాడు సర్కార్ ఈ ప్రయోగంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి .