అబూ సలేం మొబైల్ పెళ్లిపై విచారణ: ఢిల్లీకి పోలీసులు
న్యూఢిల్లీ: గ్యాంగస్టర్ అబు సలేం ఫోన్లో ముంబై అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే వార్తలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ముంబై పోలీసు బృదం బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు చేరుకుంది. కోర్టు విచారణ కోసం పోలీసు ఎస్కార్టుతో లక్నోకు తీసుకుని వెళ్తుండగా సలేం రైలులో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ రోజు అబూ సలేంను ఉంచిని కోర్టు ఆవరణలోని లాకప్ వద్ద విధులు నిర్వహించిన పోలీసులను ముంబై పోలీసు బృందం ప్రశ్నించింది. కోర్టులో అబూ సలేం తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎంఎస్ ఖాన్ను కూడా వారు విచారించినట్లు తెలుస్తోంది.
అబూ సలేం వివాహం చేసుకున్నట్లు తనకేమీ సమాచారం లేదని, ఆ విషయం సలేం తనతో చెప్పలేదని ఖాన్ పోలీసులకు చెప్పారు. ఇదే విషయంపై విచారించడానికి ముంబై పోలీసులు రేపు గురువారం లక్నో వెళ్లే అవకాశం ఉంది. మీడియా వార్తలను బలపరిచే ఆధారాలేనీ పోలీసులకు ఇప్పటి వరకు చిక్కలేదు.
సలేం పెళ్లి చేసుకున్నట్లు వార్తలపై విచారణ జరిపించాలని ముంబై టాడా కోర్టు థానే పోలీసు కమిషనర్ను అదేశించింది. దీంతో విచారణ నిమిత్తం ప్రత్యేకంగా ఓ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. తన అనుమతి లేకుండా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు ఎలా పెళ్లి చేసుకుంటాడని ప్రశ్నిస్తూ దానిపై విచారణ చేయాలని టాడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.