ఐఎన్ఎస్ బేట్వా యుద్ధ నౌక ప్రమాదం: ముగ్గురు నేవీ ఉన్నతాధికారులపై విచారణ
ముంబై : 2016లో నేవీకి చెందిన ఐఎన్ఎస్ బేట్వా యుద్ధనౌక ప్రమాదం బారిన పడిన ఘటనలో ముగ్గురు నేవీ ఉన్నతాధికారులను కోర్టు మార్షల్ విచారణ చేస్తోంది. నేవీ అధికారుల అలసత్వంతోనే యుద్ధ నౌక తిరిగిపడిందనే ఆరోపణలు వీరు ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారుల్లో ఒకరు కెప్టెన్ ఉన్నారు. ముంబైలోని నేవల్ బేస్లో కోర్టు మార్షల్ విచారణ జరుపుతోంది. రూ.2వేల కోట్లు విలువ చేసే ఈ నౌకకు మరమత్తులు చేసే సమయంలో ఒక్కసారిగా నేవల్ డాక్ యార్డు నుంచి జారి నీటిలోకి తిరగబడింది.
గత వారం నుంచే ఘటనపై కోర్టు మార్షల్ విచారణ చేస్తున్నారు. కమాండర్-ర్యాంక్ ఆఫీసర్ స్థాయి వ్యక్తి విచారణ చేపట్టారు.ఐఎన్ఎస్ బేట్వా యుద్ధ నౌక డాక్యార్డ్లో నుంచి జారి ఒక్కసారిగా నీటిలో బోల్తా పడటంతో ఇద్దరు సెయిలర్లు మృతి చెందారు. 14 మందికి స్వల్పగాయాలయ్యాయి.మొత్తం మీద ఈ యుద్ధ నౌక బరువు 3,850 టన్నులు. ఘటన జరిగిన సమయంలో యుద్ధనౌకకు మరమత్తులు చేస్తుండేవారు. ప్రస్తుతం ఈ యుద్ధనౌకకు సెయిలింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే యుద్ధనౌక ఎలా నీటిలో బోల్తా పడింది.. అసలు ప్రమాదం జరగడానికి అధికారుల అలసత్వమే కారణమా వంటి కోణాల్లో విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఐఎన్ఎస్ బెట్వా కంటే ముందు నేవీ సబ్మెరైన్ ఐఎన్ఎస్ సింధూరక్షక్ ముంబైలో పేలిపోయి నీటిలో మునిగింది. ఈ ఘటనలో 15 మంది సెయిలర్లు మృతిచెందగా... యుద్ధ నౌక పూర్తిగా ధ్వంసం అయ్యింది.