సచిన్ ఘర్ వాపసీ వెనుక కథేంటీ? చక్రం తిప్పిందెవరు? వైఎస్ జగన్తో పోలిక: ఆ ట్రెండ్కు బ్రేక్
జైపూర్: దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం.. రాజస్థాన్ రాజకీయ సంక్షోభం. తన సర్కారీ కుర్చీ కదిలే దాకా తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఎట్టకేలకు దాన్ని కాపాడుకోగలిగింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధించింది. ఓ అవాంఛిత ట్రెండ్కు బ్రేక్ వేసింది. తాను సాధించిన అధికారాన్ని భారతీయ జనతా పార్టీ చేతుల్లో పెట్టకుండా నిలువరించుకోవడంలో అనూహ్య ఫలితాన్ని సాధించినట్టయింది. రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన తొలిరోజుల్లో ఏ స్థాయిలో సంచలనం చెలరేగిందో.. సమసిన తరువాత కూడా అదే తరహా వాతావరణం నెలకొంది.
ఎక్కడా తగ్గట్లేదుగా: మళ్లీ అరలక్షకు మించి: 28% యాక్టివ్: వైరస్ కాటుకు 45 వేల మందికి పైగా బలి
బీజేపీని నిలువరించ గలిగిన కాంగ్రెస్
రాజస్థాన్.. ఓ పెద్ద రాష్ట్రం. ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ అధికార మార్పిడి ఖచ్చితంగా చోటు చేసుకునేంత రాజకీయ పరిణామాలు అక్కడ సాధారణం. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ఆవిర్భవించింది. అధికార పార్టీని కిందికి దించడానికి బీజేపీకి ఆ మాత్రం అవకాశం చాలు. ఆపరేషన్ ఆకర్ష పేరుతో అధికార పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపునకు లాక్కుని.. అధికారాన్ని అందుకోవడం బీజేపీకి చిటికె వేసినంత సులభం అనడంలో సందేహాలు అక్కర్లేదు. దక్షిణాదిన కర్ణాటక, ఉత్తరాదిన మధ్యప్రదేశ్.. ఫర్ ఎగ్జాంపుల్కు ఈ రెండు రాష్ట్రాలు చాలు.
పతనం అంచుల నుంచీ..
పతనం అంచుల దాకా వెళ్లిన ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో.. రాజ్భవన్-అసెంబ్లీ మధ్య ఘర్షణ వైఖరి తలెత్తడానికి కారణమైన సంక్షోభ పరిస్థితుల నుంచి.. గటెక్క గలిగింది కాంగ్రెస్ పార్టీ. అధికారాన్ని నిలుపుకోగలిగింది. కుప్పకూలిపోయే దశ నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి దారి తీసిన పరిస్థితుల్లో ఆద్యంతమూ ఆసక్తిని కలిగించేవే. అనూహ్య ట్విస్టులతో కూడుకుని ఉన్నవే. చట్ట సభలు-న్యాయస్థానాలు-గవర్నర్ వ్యవస్థలతో ముడిపడి.. నెలరోజుల పాటు రసవత్తరంగా సాగిన సంక్షోభం.. చివరికి సుఖాంతం కావడం కూడా ఆసక్తి కలిగించేదే. సచిన్ పైలెట్ ఘర్ వాపసీకి కారణాలేంటనేది ప్రస్తుతం చర్చనీయాంశమౌతోంది.
చక్రం తిప్పిందెవరు?
ఇలాంటి సంక్షోభకర స్థితుల నుంచి రాజస్థాన్ ప్రభుత్వం ఎలా నిలబడగలిగింది? రాజస్థాన్ రాజకీయ సంక్షోభం సమసిపోవడానికి చక్రం తిప్పిందెవరు? తెర వెనుక నడిచిన కథేంటీ? మంత్రాంగమేంటీ? క్రెడిట్ ఎవరిది? ఇవి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోన్న అంశాలు. నిజానికి- ఈ క్రెడిట్ను ఎవరూ తీసుకోవట్లేదు. ఈ ఘనత ఫలానా నాయకుడిదంటూ ఎవరూ గానీ, ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గానీ, ఇటు కాంగ్రెస్ అధిష్ఠానం గానీ ఆ క్రెడిట్ను తీసుకోవట్లేదు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ తురుఫుముక్కగా భావిస్తోన్న ప్రియాంకా గాంధీ వాద్రా గానీ తాము చక్రం తిప్పామని చెప్పుకోవట్లేదు.
సచిన్ పైలెట్ను వైఎస్ జగన్తో పోల్చి చూస్తోన్న నెటిజనులు..
రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం నెలకొనడానికి, అది సుఖాంతం కావడానికీ ప్రధాన కారుకుడు.. సచిన్ పైలెట్. సచిన్ పైలెట్, ఆయనకు మద్దతు ఇస్తోన్న 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతోనే ఈ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. అదే సచిన్ పైలెట్.. చివరికి మెత్తబడ్డారు. పార్టీ గూటికి చేరుకున్నారు. ఇదే అంశం.. ఏపీ రాజకీయాల్లోనూ చర్చలకు దారి తీస్తోంది. సచిన్ పైలెట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోల్చి చూస్తున్నారు నెటిజనులు.
Recommended Video
ఇద్దరికీ పోలిక ఉందంటూ..
వైఎస్ జగన్.. సచిన్ పైలెట్ ఇద్దరికీ పోలిక ఉంది. ఇద్దరి కుటుంబ నేపథ్యం రాజకీయాలే. ఇద్దరు నేతల కుటుంబాలు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్కు ప్రాతినిథ్యాన్ని వహించినవే. సచిన్ తండ్రి రాజేష్ పైలెట్ కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇద్దరూ యువనేతలుగా గుర్తింపు పొందారు. అనుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన వైఎస్ జగన్.. సొంతంగా పార్టీని స్థాపించి, పదేళ్ల వ్యవధిలో అధికారాన్ని అందుకోగలిగారు. ముఖ్యమంత్రి అయ్యారు. తిరుగుబాటు లేవదీసిన సచిన్ పైలెట్ మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. అంతకుముందు.. మధ్యప్రదేశ్కు చెందిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్కు గుడ్బై చెప్పి.. బీజేపీలో చేరారు. రాజ్యసభకు ఎన్నికయ్యారు.