దృశ్యం సినిమా తరహాలో 22 ఏళ్ల యువతిని చంపిన తండ్రీ కొడుకులు: అసలేం జరిగిందంటే?
ఇండోర్: రెండేళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మహిళా కాంగ్రెస్ కార్యకర్త హత్య జరిగింది. ఆ హత్య నుంచి తప్పించుకునేందుకు నిందితులు దృశ్యం సినిమా తరహాలో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు. హత్య కేసులో నిందితులు భారతీయ జనతా పార్టీ నాయకులు, అతని ముగ్గురు కొడుకులు, మరో వ్యక్తి ఉన్నారు. మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్యకు గురైన మహిళా కాంగ్రెస్ నాయకురాలి పేరు ట్వింకిల్ డర్గే. ఆమె వయస్సు 22 ఏళ్లు. 2016లో హత్యకు గురైంది. అసలేం జరిగిందంటే... ట్వింకిల్ రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయింది. ఓ భూవివాదం కేసులో జగదీష్ కరోటియా అనే నాయకుడు ఆమెను హత్య చేయించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇందులో అతని ముగ్గురు కొడుకులు సహా మరొకరి హస్తం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
దృశ్యం తరహా ప్లాన్
నిందితులు ట్వింకిల్ కేసు విషయంలో దృశ్యం తరహా ప్లాన్ ఉపయోగించారని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. హత్య అనంతరం ఆమెను కారులో తీసుకెళ్లి కాల్చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా ఓ చోట చనిపోయిన కుక్క మృతదేహాన్ని పాతిపెట్టారు.
తవ్విన చోట కుక్క మృతదేహం
ఆ తర్వాత కొద్ది రోజులకు హత్య జరిగిన రోజు రాత్రి అనుమానాస్పద ఘటన ఏదో జరిగిందని వారే గుర్తు తెలియనివారిగా నటిస్తూ పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత జరిగిన విచారణలో ఉప్పందించిన వారే అసలైన నిందితులుగా తేలారు. మృతదేహాన్ని పాతిపెట్టారని పోలీసులు అనుమానించిన చోట తవ్వి చూస్తే కుక్క మృతదేహం బయటపడింది.
ఐదుగురు నిందితుల అరెస్ట్
నిందితులైన జగదీష్ కరోటియా (65), అతని ముగ్గురు కొడుకులు అజయ్ (36), విజయ్ (38), వినయ్ (31), మరో వ్యక్తి నీలేష్ కశ్యప్ (28)లను పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 16, 2016న హత్య జరిగింది. కాగా, ఇదిలా ఉండగా మరో వాదన కూడా వినిపిస్తోంది.
పెళ్లి కోసం ఒత్తిడి
జగదీష్ కరోలియాతో వారి మధ్య వివాహేతర సంబంధం ఉందని, దీంతో తనను పెళ్లి చేసుకొని తనతోనే ఉండాలని ట్వింకిల్ అతనిపై ఒత్తిడి తెచ్చిందని, దీంతో అతను హత్య చేశాడని అంటున్నారు. కానీ దీనికి జగదీశ్, అతని కుటుంబం అంగీకరించలేదని చెబుతున్నారు. హత్య జరిగిన రోజు నిందితులు.. జగదీష్ నీకు ఓ ప్లాట్ ఇస్తారని చెప్పి అక్కడకు తీసుకెళ్లి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కారులో తీసుకెళ్లి కాల్చేశారు.