సీఎం పిలుపు: కట్నం తిరిగిచ్చేసిన వరుడి కుటుంబం
ఓ వైపు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడుస్తున్నప్పటికీ.. ఏదో ఒక చోట వరకట్నం వేధింపులతో మహిళలు బలవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తమ రాష్ట్రంలోని యువకులు ఎవరూ కూడా వరకట్నం తీసుకోవద్దని పిలుపునిచ్చార
పాట్నా: ఓ వైపు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడుస్తున్నప్పటికీ.. ఏదో ఒక చోట వరకట్నం వేధింపులతో మహిళలు బలవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తమ రాష్ట్రంలోని యువకులు ఎవరూ కూడా వరకట్నం తీసుకోవద్దని పిలుపునిచ్చారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఆయన పిలుపునకు ఓ కుటుంబం సానుకూలంగా స్పందించింది. అప్పటికే తీసుకున్న కట్నాన్ని వధువు కుటుంబానికి తిరిగి ఇచ్చేసింది.
వివరాల్లోకి వెళితే.. అరా జిల్లాకు చెందిన మాజీ ప్రిన్సిపల్ హ్రింద సింగ్ తనయుడు ప్రేమ్ రంజన్ సింగ్ వివాహం డిసెంబరు 3వ తేదీన జరగనుంది. ఇందుకోసం వధువు కుటుంబం నుంచి పెళ్లి ఖర్చుల నిమిత్తం హ్రింద రూ.4లక్షలు తీసుకున్నారు.
అయితే.. బీహార్ వాసులు కట్నం తీసుకోవద్దని సీఎం నితీశ్కుమార్ ఇటీవల పిలుపునిచ్చారు. దీని నుంచి హ్రింద స్ఫూర్తి పొందారు. తన కుమారుడి పెళ్లికి కట్నం కింద తీసుకున్న నగదును పెళ్లికూతురు కుటుంబానికి తిరిగి ఇచ్చారు. దీనిపై వధువు సోదరుడు రోహిత్ సింగ్ స్పందించారు.
'కట్నం కింద తీసుకున్న నగదు తిరిగి ఇచ్చేయడానికి వరుడు కుటుంబసభ్యులు మా ఇంటికి రావడంతో పెళ్లి రద్దు చేసుకుంటారేమోనని అని కంగారు పడ్డాను. కానీ విషయం తెలిసి.. నా సోదరి ఇటువంటి మంచి కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నందుకు గర్వంగా ఉంది.' అని ఆనందం వ్యక్తం చేశాడు. ఆదర్శమైన నిర్ణయం తీసుకున్న ఆ కుటుంబాన్ని ఎవరైనా అభినందించాల్సిందే మరి.