గడ్చిరోలి దాడి: పోలీసులదే తప్పు: యుద్ధానికి ఖాళీ చేతులతో వెళ్లారు?: ఏపీ మాజీ డీజీపీ స్వరణ్ జిత్
అమరావతి: అత్యంత వివాదాస్పదునిగా, విధి నిర్వహణలో అంతే కఠినంగా వ్యవహరించిన పోలీసు బాస్ గా పేరు తెచ్చుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ స్వరణ్ జిత్ సేన్.. మరోసారి తాజాగా వార్తల్లోకి ఎక్కారు. వివాదాస్పద ప్రకటనతోనే ఆయన తాజాగా చర్చల్లోకి రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం చోటు చేసుకున్న మావోయిస్టుల దాడి ఘటనలో స్వరణ్ జిత్ సేన్ పోలీసులనే తప్పు పట్టారు. కనీసం వ్యూహం లేకుండా, ముందుచూపు లేకుండా పోలీసులు వ్యవహరించారని చెప్పారు. మావోయిస్టులపై కంటి తుడుపు చర్యలు ఎప్పుడూ పనికి రావని, వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.
గడ్చిరోలి దాడి ఘటనపై ఆయన ఓ ప్రైవేటు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. గడ్చిరోలి జిల్లా కుర్ ఖేడా-జముర్ ఖేడా మార్గంలో ఓ ప్రైవేటు వాహనంలో ప్రయాణిస్తున్న సీ-60 మహారాష్ట్ర ప్రత్యేక విభాగానికి చెందిన క్విక్ రెస్పాన్స్ టీమ్ పోలీసుల బలగాలపై మావోయిస్టులు మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 15 పోలీసులు, డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు.
బుర్ఖాలు సరే..పరదాలను నిషేధించమని డిమాండ్ చేయగలరా? : ఒవైసీ
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. దిగ్బ్రాంతికర వాతావరణం నెలకొంది. సద్దుమణిగారనుకుంటున్న దశలో మావోయిస్టులు ఒక్కసారిగా శక్తిమంతమైన ఐఈడీతో పేలుడు సృష్టించారు. పోలీసులు ప్రాణాలను బలి గొన్నారు. మావోయిస్టుల దాడిలో అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.
కనీస ముందుచూపు లేకుండా వెళ్తే ఎలా?
ఈ ఘటన మొత్తంలో పోలీసులు కనీసం వ్యూహం లేకుండా వ్యవహరించారని స్వరణ్ జిత్ సేన్ అభిప్రాయ పడ్డారు. మావోయిస్టులు ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్నారని, అత్యాధునిక ఆయుధాలను వాడుతున్నారని చెప్పారు. వారిని ఢీ కొట్టాలంటే- సరైన వ్యూహం అవసరమని, లేకపోతే- దాని వల్ల సంభవించే ఫలితాలు గానీ, ఎదురయ్యే పరిణామాలు గానీ పోలీసులకు ప్రతికూలంగానే ఉంటాయని అన్నారు. మావోయిస్టులు పక్కా ప్రణాళికను రచించి, పోలీసులపై దాడి చేశారని, దీనికి ధీటుగా సమాధానం ఇవ్వడంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని స్వరణ్ జిత్ సేన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులపై గానీ, మావోయిస్టులపై గానీ యుద్ధం చేయాలనుకుంటే ఖాళీ చేతులతో వెళ్తే సరిపోదని అన్నారు. పకడ్బందీ వ్యూహాన్ని రచించుకోవాల్సి ఉంటుందని, దీనికి అనుగుణంగా అడుగులు వేయాల్సి ఉంటుందని చెప్పారు. మావోయిస్టులను కూకటి వేళ్లతో ఎలా పెకిలించి వేయాలనే విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.