‘Insult to nation’:రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ నియామకంపై కాంగ్రెస్ ఫైర్
రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను నియమించడంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ ఒంటికాలిపై లేచింది. వివాదాస్పద నేతకు రక్షణశాఖ కమిటీలో చోటు ఇవ్వడం ఏంటి అని మండిపడింది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ 2008 మాలేగావ్ బాంబ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాలా సందర్భాల్లో నోటిదురుసు ప్రదర్శించి.. హైకమాండ్ చేత చివాట్లు కూడా తిన్నారు.
21 మంది సభ్యులతో..
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. 21 మందికి సభ్యులుగా అవకాశం కల్పించారు. అయితే అందులో ప్రజ్ఞాసింగ్ పేరు ఉండటం అగ్గిరాజేసింది. బాంబు పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం గాడ్సే సానుభూతిపరులపై కూడా కరుణ చూపిస్తోందా అని అడిగారు.
లైట్ తీసుకున్నారా..?
దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం తేలికగా తీసుకుందని విమర్శించింది. రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రజ్ఞాసింగ్కు చోటు కల్పించడం అంటే దేశాన్ని అవమానించడమేనని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు ట్వీట్ చేశారు.
సరికాదు..
ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని గుర్తుచేశారు. కానీ కోర్టు కేసులు, బాంబ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మాత్రం చోటు కల్పించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందన్నారు.
303 మంది సభ్యుల్లో..
గత ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లను గెలుచుకుందని కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు. వారిలో ఎవరు మీకు కమిటీలో నియమించేందుకు నచ్చలేదా అని ప్రశ్నించారు. ప్రజ్ఞాసింగ్ను కమిటీలోకి తీసుకోవడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
గాడ్సే దేశ భక్తుడట..
2019, మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నాథూరామ్ గాడ్సేను దేశ భక్తుడు అని ఆమె అనడంతో పెద్ద దుమారమే రేగింది. ప్రధాని నరేంద్ర మోడీ జోక్యంతో ఆమె తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఇదివరకు చాలా సందర్బాల్లో నోటిదురుసు ప్రదర్శించడంతో.. బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మందలించారు.