దేశ ప్రజలు, ప్రజాస్వామ్యానికే అవమానం: పార్లమెంటులో విపక్షాల తీరుపై ప్రధాని మోడీ ఆగ్రహం
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకుండా ఆందోళనలతో అడ్డుకుంటున్న విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటు, రాజ్యాంగ, ప్రజాస్వామ్యం, ప్రజలను అవమానించడమేనని ప్రధాని వ్యాఖ్యానించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రతిపక్షాల వైఖరిపై ప్రధాని మోడీ మండిపడ్డారు.
జులై 19న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు ఆందోళనలు, నిరసనలను కొనసాగిస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలకు ముందే పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో విచారణకు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. అంతేగాక, కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి.
విపక్షాల ఆందోళనలు, నిరసనలతో పార్లమెంటు కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగింది. తరచూ వాయిదా పడుతూ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ.. విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో చర్చకు ఆసక్తి చూపకపోవడమేగాక, కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించడం లేదని విమర్శించారు.
పార్లమెంటు సమావేశాలను విపక్షాలు అడ్డుకోవడంతో ఇప్పటికే రూ. 130 కోట్ల ప్రజాధానం వృథా అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయినప్పటికీ విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మంగళవారం రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే సభ్యులు వెల్ వద్దకు దూసుకురావడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ఆందోళనలు కొనసాగడంతో మరో రెండు గంటలపాటు వాయిదా పడింది.
మరోవైపు లోక్సభలోనూ అదే వైఖరిని కొనసాగించాయి ప్రతిపక్ష పార్టీలు. పెగాస్ హ్యాకింగ్ సహా పలు అంశాలపై ఆందోళనలు కొనసాగించాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత మళ్లీ విపక్షాల సభ్యులు ఆందోళనలు కొనసాగించడంతో మరో రెండు గంటలపాటు వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.