భారత్ విచ్చిన్నానికి పాక్ భారీ కుట్ర : ఇంటలిజెన్స్ రిపోర్ట్ తో ఆర్మీ అలర్ట్
న్యూఢిల్లీ : ఓవైపు కవ్వింపు చర్యలు మరోవైపు ఉగ్ర కుట్రలతో భారత్ విచ్చిన్నానికి పాక్ కుయుక్తులు పన్నుతోంది. తాజాగా 100 మంది ఉగ్రవాదులతో భారత్ పై తెగబడేందుకు పాక్ వ్యూహాలు రచిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో నియంత్రణ రేఖ వెంబడి సైన్యాన్ని మరింత పటిష్టం చేసింది ఇండియన్ ఆర్మీ.
ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఎల్ఓసీ వెంట భద్రతను పెంచామని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ వెల్లడించారు. ఎంతమంది ఉగ్రవాదులు భారత్ పై తెగబడినా.. వెన్ను చూపేది లేదని వారికి తగిన గుణపాఠం చెప్పే విధంగా భారత ఆర్మీ సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే గడిచిన 36గంటల్లో పాక్ సైన్యం ఆరుసార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని, సాధారణ జనజీవన సమూదాయాలను టార్గెట్ గా చేసుకుని కూడా పాక్ కాల్పులకు తెగబడుతోందని రక్షణ శాఖ మానవ సంబంధాల అధికారి మానిష్ మెహతా పేర్కొన్నారు.
కాగా, ఆటోమేటిక్ ఆయుధాల సహాయంతో కాల్పులకు తెగబడుతోన్న పాక్ ను ఇండియన్ ఆర్మీ విజయవంతంగా అడ్డుకోగలిగిందని మెహతా తెలిపారు. సర్జికల్ దాడుల తర్వాత కూడా పాక్ తన తీరును మార్చుకోకుండా వ్యవహారిస్తోన్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.