గుజరాత్లోకి 10మంది ఉగ్రవాదులు?: పాక్, ఐబి హెచ్చరిక
అహ్మదాబాద్: గుజరాత్లో ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు పంపింది. గుజరాత్లోకి సుమారు 10 మంది ఉగ్రవాదులు ప్రవేశించినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని గుజరాత్ ఇంటెలిజెన్స్ వింగ్, పోలీసులను ఐబీ హెచ్చరించింది.
ఈ హెచ్చరికలతో గుజరాత్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా బలగాలు విస్తృత గాలింపు చేపట్టాయి. ఎన్ఎస్జీ దళాలు ఇప్పటికే గుజరాత్ చేరుకున్నాయి.
కాగా, లష్కరే తోయిబా, జైషీ మహ్మద్ నుంచి 10 మంది ఉగ్రవాదు గుజరాత్లోకి ప్రవేశించి ఉండవచ్చునని పాక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్(ఎన్ఎస్ఏ).. భారత చీఫ్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోవల్కు ఒక మేసేజ్ పంపించారు. దానికి తగ్గట్టుగానే గుజరాత్ కోస్ట్లో రెండు, మూడు బోట్లు అనుమానాస్పదంగా తిరగడం.. వాటిని కనిపెట్టన తర్వాత గుజారత్లో ఉగ్రవాదులు ప్రవేశించారని అధికారులు నిర్ధారణకు వచ్చి అప్రమత్తమయ్యారు.
దీంతో కేంద్రం ఎన్ఎస్జీ కమెండోలను గుజరాత్కు పంపింది. ముఖ్యంగా శివారాత్రి (సోమవారం) సందర్భంగా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. దీంతో గుజరాత్లో ప్రధాన ఆలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.
భారత్లోకి ప్రవేశించిన పాక్ బధిర బాలిక: పాకిస్థాన్ రేంజర్లకు అప్పగింత
అంతర్జాతీయ సరిహద్దులు దాటి అనుకోకుండా భారత్లోకి ప్రవేశించిన ఐదేళ్ల బధిర బాలికను సరిహద్దు భద్రతా దళం అధికారులు పాకిస్థాన్ రేంజర్లకు అప్పగించారు. అబోహార్ సెక్టార్లోని నాథా సింగ్ వాలా సరిహద్దు వద్ద ఈ బాలికను గుర్తించినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
బాలికను ప్రశ్నించినప్పుడు బధిర బాలిక అని అర్థమైందన్నారు. ఆ బాలిక ఎవరన్నది చెప్పలేకపోయిందని తెలిపారు. అనంతరం పాక్ రేంజర్లతో సంప్రదించి బాలికను వారికి అప్పగించినట్లు వెల్లడించారు.