ఉప ఎన్నికలు: సీఎం చేతిలో ఇంటలిజెన్స్ నివేదిక, కాంగ్రెస్ కు భారీ షాక్, బీజేపీకి!
బెంగళూరు: కర్ణాటకలో జరుగుతున్న మూడు లోక్ సభ, రెండు శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికలపై ఇంటలిజెన్స్ ఇచ్చిన నివేదిక చూసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు. ఒక్క నియోజక వర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు చాల తక్కువగా ఉన్నాయని తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు ఆందోళనకు గురైనారు.
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇంటలిజెన్స్ శాఖ సీఎం హెచ్.డి. కుమారస్వామి దగ్గర ఉన్నాయి. బళ్లారి, శివమొగ్గ, మండ్య లోక్ సభ నియోజక వర్గాలు, రామనగర, జమఖండి శాసన సభ నియోజక వర్గాల్లో నవంబర్ 3వ తేదీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అని వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని సీఎం. కుమారస్వామి ఇంటలిజెన్స్ అధికారులకు సూచించారని తెలిసింది. ఇంటలిజెన్స్ అధికారులు రహస్యంగా వివరాలు సేకరించి సీఎం హెచ్.డి. కుమారస్వామికి ఇచ్చారని తెలిసింది.
ఐదు నియోజక వర్గాల్లో మూడు బీజేపీ, రెండు నియోజక వర్గాల్లో జేడీఎస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చిందని తెలిసింది. బళ్లారి, శివమొగ్గ, జమఖండి నియోజక వర్గాల్లో బీజేపీ, మండ్య, రామనగర నియోజక వర్గంలో జేడీఎస్ విజయం సాధించే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చిందని సమాచారం.
కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు పొత్తుతో బళ్లారి, జమఖండిలో కాంగ్రెస్, మండ్య, శివమొగ్గ, రామనగరలో జేడీఎస్ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇంటలిజెన్స్ అధికారుల నివేదికతో బీజేపీ నాయకులు ఉత్సాహంతో ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.