ఇక వీపీఎఫ్ 2.5 లక్షలు దాటితే పన్ను: ఉద్యోగుల్లో 1 శాతం మందిపైనే ప్రభావం
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపుపన్నుపై ఈసారి ఎలాంటి మినహాయింపులు ఇవ్వని విషయం తెలిసిందే. అంతేగాక, అధిక వడ్డీని పొందే వీపీఎఫ్ వినియోగదారులకు కూడా కేంద్రం షాకిచ్చింది.
ఆ మొత్తాల వచ్చే వడ్డీపైనే పన్ను..
పన్ను మినహాయింపుతోపాటు అధిక వడ్డీని పొందేందుకు కొందరు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్(వీపీఎఫ్)ను వినియోగించుకుంటూ ఉంటారు. అయితే, ఈ ఏడాదిలో రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉద్యోగి వాటా(12 శాతం), వీపీఎఫ్ కింద జమ అయ్యే మొత్తాలపై ఇక పన్ను పడనుంది. ఒకే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన మొత్తానికంటే అధికంగా జమ చేసిన వాటిపై వచ్చే వడ్డీపై ఈ పన్ను విధించనున్నారు. ఉద్యోగి వాటాను మాత్రమే ఇక్కడ లెక్కించనున్నారు.
ఈ పన్ను ప్రభావం 1 శాతం ఉద్యోగులపైనే.
కాగా, ఈ పన్ను ప్రభావం ఎక్కువ మొత్తంలో జీతం పొందే వారిపై మాత్రమే ఉండనుంది. మొత్తం పీఎఫ్ చందాదారుల్లో కేవలం ఒక్క శాతం మందిపైనే ఈ ప్రభావం పడబోతోందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. నెలకు సుమారు రూ. 20వేల వరకు పీఎఫ్ ఖాతాల్లో జమ చేసేవారిపైనే ఈ పన్ను పడనుంది. ఇది ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. కాగా, ప్రస్తుతం పీఎఫ్ మొత్తాలపై వార్షికంగా 8.5 వాతం వడ్డీ పొందుతున్నారు.
పెరగనున్న ఈ వస్తువుల ధరలు
తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రకారం.. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఫ్రిజ్లు, ఏసీల ధరలు పెరిగే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, లిథియంతో తయారు చేసిన ఫోన్ బ్యాటరీ ధరలు, ఎల్ఈడీ బల్బులు, సర్కూట్ బోర్డులు, వాటి విడిభాగాలు, సోలార్ ఇన్వెర్టర్లు, సోలార్ లైట్స్ ధరలు పెరగనున్నాయి. ఆటో మొబైల్ విడి భాగాలు, విండ్ స్క్రీన్స్, సిగ్నలింగ్ పరికరాలు, ఇంక్ క్యాట్రిట్జ్లు, ఇంక్ స్ప్రే నాజిల్స్, లెథర్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ముడి సిల్క్, నూలు వస్త్రాల ధరలు, ప్లాస్టిక్ వస్తువులు, సింథటిక్ వస్తువుల ధరలు, వంట నూనెలు పెరగనున్నాయి. విలువైన రాళ్లు, రత్నాల ధరలు కూడా పెరగనున్నాయి.
తగ్గనున్న ఈ వస్తువుల ధరలు
ఇక దిగుమతి సుంకాలు తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో బంగారు, వెండి ధరలు తగ్గనున్నాయి. ప్లాటినం, పల్లాడియం, అంతర్జాతీయ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలు, యంత్రాల ధరలు తగ్గుతాయి. ఇనుము, ఉక్కు, రాగి ఉత్పత్తుల ధరలు, నైలాన్ దుస్తుల ధరలు తగ్గనున్నాయి.
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గనున్నాయి.