ఇంట్రెస్టింగ్ : కుమారస్వామి సీఎంగా 2019 వరకేనా..?
కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందా..? 2019 వరకే కుమారస్వామి సీఎంగా ఉంటారా...? ఆ తర్వాత పరిస్థితులు మారబోతున్నాయా...? అంటే మిశ్రమ సమాధానం వినిపిస్తోంది. కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక మలుపులు తీసుకుని ఎట్టకేలకు కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్లో మంత్రి పదవులు దక్కలేదని కొందరు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ గొడవ సద్దు మణిగినట్లే కనిపిస్తోంది.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కుమారస్వామి చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తన ప్రభుత్వం స్థిరంగానే ఉందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు... కనీసం ఒక ఏడాది అంటే వచ్చే లోక్సభ ఎన్నికల నాటివరకైనా తనే సీఎంగా ఉంటానని చెబుతూనే అందరినీ కొంత అయోమయంలోకి నెట్టేశాడు. అంటే 2019 తర్వాత ఆయనే సీఎంగా ఉంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో ఏడాది వరకు తానే సీఎంగా ఉంటానని చెప్పిన కుమారస్వామి... ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్లు చెప్పాడు. గత ప్రభుత్వంలో ఏమి జరిగింది అని లెక్కలు తీసేదాని బదులుగా... తాను ఏమి చేయాలనుకుంటున్నానో చేసి చూపిస్తానంటూ కుమారస్వామి చెప్పారు.
మే 12 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు రావడంతో ... కాంగ్రెస్ జేడీఎస్లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీకి చుక్కెదురైంది. ఇక పాలనా పరమైన విషయానికొస్తే రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. రుణమాఫీని రెండువిడతలుగా చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పిన స్వామి... మరో 15 రోజుల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరో వైపు జూలై మొదటి వారంలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.