మస్ట్ రీడ్: బడ్జెట్ సమయంలో ఆర్థికశాఖ మంత్రి చూపించే ఆ బ్రీఫ్ కేసు చరిత్ర ఏంటి..?
Recommended Video
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే బడ్జెట్ గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. ఒక్కో అంశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు హల్వా వేడుకలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ఇదే బడ్జెట్ సమావేశాల సమయంలో ఒక బ్రీఫ్ కేసును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటులోకి ప్రవేశించక ముందు మీడియా ఎదుట ప్రదర్శిస్తారు. దీని వెనక కూడా ఓ కథ ఉంది.
బ్రీఫ్ కేసు వెనక హిస్టరీ
బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ ప్రసంగం చేసేముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఓ సూట్కేసును తనతోపాటుగా తీసుకొస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంప్రదాయం ను 18వ శతాబ్దంలో యూకే ప్రారంభించింది. భారత్ కూడా బ్రిటీషు వారు నేర్పిన చాలా అంశాలను పాటిస్తోంది. బ్రీఫ్ కేసును కూడా ప్రదర్శించడం ఇందులో భాగంగానే వచ్చింది. ఇక తొలి బడ్జెట్ బాక్స్ను 1860లో యూకే ఛాన్సెలర్ విలియం ఇవార్ట్ గ్లాడ్స్టోన్ డిజైన్ చేశారు. ఆ బాక్స్ను చెక్కతో తయారు చేశారు. దానిపై బ్లాక్ కలర్ పట్టు వస్త్రంతో డెకొరేట్ చేశారు. దానిపై లెదర్ను ఉంచారు. అంతకుముందు ఆర్థిక విధానాలు కలిగి ఉన్న ప్రతులను హౌజ్ ఆఫ్ కామన్స్కు లెదర్ బ్యాగ్లలో తీసుకొచ్చేవారు.
యూకేలో చెక్కతో చేసిన బాక్స్లో బడ్జెట్ ప్రతులు
ఇక బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా ఉండటం ఎక్కువ ప్రసంగంకు సంబంధించి ఎక్కవ డాక్యుమెంట్లు ఉండటంతో ఒక బాక్స్ ఇవ్వాల్సిందిగా గ్లాడ్స్టోన్ కోరారట. బడ్జెట్ ప్రసంగంకు సంబంధించిన పేపర్లు అందులో ఎప్పటికీ భద్రంగా ఉండేలా బాక్స్ను ఇవ్వమని కోరారట. ఇక బడ్జెట్ అనే పదం ఫ్రెంచి పదం "Bougette" నుంచి వచ్చింది. దీనర్థం చిన్న బ్యాగ్ . యూకేలో దీన్నే బడ్జెట్ బాక్స్ అని పిలుస్తారు. భారత్లో బ్రీఫ్కేస్ అని పిలుస్తారు. ఇక బ్రీఫ్ కేస్ రంగు విషయానికొస్తే యూకే సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఎప్పటికీ ఎరుపు రంగు బాక్స్తోనే ఛాన్సెలర్ హౌజ్ ఆఫ్ కామన్స్లోకి అడుగుపెడతారు. ఆ నాడు గ్లాడ్స్టోన్ ప్రవేశపెట్టిన రెడ్ బాక్స్నే 2011 వరకు వినియోగించేవారు. కానీ ఆ బాక్స్ పాతదిగా అయిపోయి చెదిరిపోవడంతో 2011లో జార్జ్ ఆస్బోర్న్ కొత్త బాక్సును మార్చారు.
భారత్లో లెదర్ బ్రీఫ్ కేసు
భారత్లో మాత్రం ఆయా ఆర్థిక శాఖ మంత్రులు వారికి నచ్చిన రంగులో ఉండే బ్రీఫ్ కేసులతో సభకు హాజరవుతూ వస్తున్నారు. కొందరు ఎరుపు రంగు బ్రీఫ్కేసుతో వస్తే మరికొందరు నలుపు రంగు బ్రీఫ్ కేసుతో కనిపించేవారు. కొందరైతే టాన్ కలర్ బ్రీఫ్ కేసుతో కూడా సభకు వచ్చారు. అయితే యూకేలోలా ఆ బాక్సును మరొకరికి బదిలీ చేసే సంప్రదాయం భారత్లో లేదు. అంతేకాదు ఫలానా కలర్ ఉన్న బ్రీఫ్కేసునే వాడాలనే నిబంధన కూడా లేకపోవడంతో ఎవరికి తోచినట్లుగా ఎవరికి నచ్చిన కలర్లో వారు బ్రీఫ్ కేసును సభకు తీసుకొస్తున్నారు.
ట్రెడిషన్కు గుడ్బై చెప్పి కొత్త ట్రెండ్తో నిర్మలా సీతారామన్
వాజ్పేయి సర్కార్లో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సింగ్ బ్రీఫ్కేసుకు బకల్స్ మరియు స్ట్రాప్స్ ఉండేవి. మన్మోహన్ సింగ్ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్లాడ్స్టోన్ బాక్స్ ఎలా అయితే ఉండేదో అలాంటి బాక్స్నే పార్లమెంటుకు తీసుకొచ్చారు. అయితే అది నలుపు రంగులో ఉండేది. ఇక మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరం స్కార్లెట్ లెదర్ బ్రీఫ్కేసును తీసుకొచ్చేవారు. యూకేలో ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న బ్రీఫ్కేస్. ఇక దివంగత మాజీ ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2015లో టాన్ కలర్ బ్రీఫ్ కేసు తీసుకురాగా... ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం బ్రిటీష్ పద్ధతులకు స్వస్తి చెప్పి బడ్జెట్ ప్రతులు కలిగి ఉన్న లెడ్జర్ను పార్లమెంటుకు తీసుకొచ్చారు. ఎరుపు రంగు బట్టతో ప్యాక్ చేయబడ్డ లెడ్జర్ పై జాతీయ చిహ్నం, అశోక్ చక్ర ముద్రించి ఉన్నాయి.