ఇంట్రెస్టింగ్: ఆవుపేడ నుంచి పేపర్ ఉత్పత్తి... ఆవిష్కరించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
జైపూర్: ఆవుపేడ... దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మన దేశంలో. పంటలకు మంచి ఎరువు. ఇందులో పంటకు కావాల్సిన పోషక విలువలు ఉన్నాయి. కేవలం పంటలకు మంచి ఎరువుగానే కాదు... దీన్నుంచి బయోగ్యాస్ (జీవవాయువు)కూడా తయారు చేసి తద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ఆవుపేడతో ఉపయోగాల గురించి చిన్నప్పుడు స్కూలుకు వెళ్లే రోజుల నుంచే తెలుసుకుంటున్నాం. తాజాగా ఆవుపేడ నుంచి పేపర్ తయారు చేయొచ్చనేది వెలుగు చూసింది. ఇది చాలా ఆసక్తికరంగా మారింది.
అద్భుతం: గోమూత్రంతో కేన్సర్కు చెక్ పెట్టొచ్చట..!
ఆవుపేడ నుంచి తయారు అయిన పేపరును కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ జైపూర్లో ఆవిష్కరించారు. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ పరిధిలో పనిచేసే కుమారప్ప నేషనల్ హ్యాండ్మేడ్ పేపర్ ఇన్స్టిట్యూట్ ఆవుపేడ నుంచి పేపరును తయారు చేసింది. ఈ పేపరు తయారీకి కొంచెం పత్తితో తయారైన పేపర్తో పాటు ఆవుపేడ కూడా కలిపి నాణ్యమైన పేపరును ఉత్పత్తి చేశారు. ఈ పేపర్ల రాకతో పలు లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పేపర్లు వినియోగించేందుకు కావాల్సింది పేడ. ఆవు వీధుల్లో పేడ వేస్తుంది. పేపరు తయారీ కోసం పేడ కావాలి కాబట్టి ముందుగా వీధులు శుభ్రమవుతాయి. పేడకు డిమాండ్ ఏర్పడుతుంది కాబట్టి ఆవులను పెంచుతున్న రైతులు లబ్ధి పొందుతారు.
రాజస్థాన్లో గోపాలన్ శాఖ గోశాలల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. గోవులను ఎన్ని పెంచితే అంత పేపర్ ఉత్పత్తి జరుగుతుందని భావిస్తోంది. ఇప్పటికే జాలోర్ జిల్లాలోని ఓ గోశాల ఆవుపేడతో పేపర్ ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం చాలా మటుకు గోశాలలు గోమూత్రం నుంచి ఔషధాలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. కొత్త సాంకేతికతను వినియోగంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గోశాలలకు కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఇస్తోంది.
ప్రస్తుతం రాజస్థాన్లో 1,160 రిజిస్టర్ అయిన గోశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపు 5లక్షల గోవులున్నాయి. ఆవుపేడ, గోమూత్రం నుంచి సేంద్రీయ ఎరువులను రైతులు తయారు చేస్తున్నారు. దీనివల్ల బయోగ్యాస్ మాత్రమే తయారు కావడం లేదు... వీటి వ్యర్థాల్లో నైట్రోజన్ కూడా ఉంటుంది.