తమిళనాడులో ఆసక్తికర రాజకీయాలు..! క్రికెట్ ప్రపంచకప్ తో పోల్చుకుంటున్న పార్టీలు..!!
చెన్నై/హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాలపై క్రికెట్ ప్రపంచకప్ ప్రభావం బాగా పనిచేస్తున్నట్టగు తెలుస్తోంది. రాజకీయాలకు క్రికెట్ కు ముడి పెడుతూ తమిళ రాజకీయ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అదికార, ప్రతిపక్ష పార్టీల మద్య ఈ వ్యాఖ్యలు తారా స్థాయిలో నడుస్తున్నాయి. క్రికెట్ ప్రపంచకప్తో పోలుస్తూ మరోసారి అన్నాడీఎంకేనే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తమిళనాడు మంత్రి డి జయ కుమార్ విశ్లేషించారు. రాజకీయ ప్రత్యర్థి డీఎంకే న్యూజిలాండ్లాగానే చివరకు ఓటమిని చవిచూస్తుందన్నారు. ఆసక్తికరంగా సాగిన ప్రపంచకప్ పోరాటంలో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ కప్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఇంగ్లాండ్ ఓడిపోతుందని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో వాటికి భిన్నంగా, ఇంగ్లాండ్ విజయాన్ని సొంతం చేసుకుంది' అని జయకుమార్ మీడియాతో అన్నారు.
ప్రస్తుతం తమిళనాడులోనూ ఇంగ్లాండ్ - న్యూజీలాండ్ తరహా పరిస్థితి నెలకొన్నాయన్నారు. 'డీఎంకే కూడా న్యూజిలాండ్లా గెలుపు మీద ధీమాతో ఉంది. కానీ ఇంగ్లాండ్ లాగే అన్నాడీఎంకేను విజయం వరిస్తుంది. రానున్న ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకుంటుంది' అని పేర్కొన్నారు. ఇలా రాష్ట్ర రాజకీయాలను క్రికెట్తో పోలుస్తూ మంత్రి వ్యాఖ్యలు చేయడం వారం రోజుల్లో ఇది రెండో సారి. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంపై మాట్లాడుతూ.. ఏప్రిల్ 18న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి కూడా తాత్కాలిక ఎదురు దెబ్బ తగిలిందని తెలిపారు. 'రానున్న రోజుల్లో టీమిండియా గెలుస్తుంది. అలాగే అన్నా డీఎంకే కూడా ఎన్నికల్లో ఎప్పుడూ గెలుస్తుంది' అని టీమిండియాను, తన పార్టీని పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు.