బర్త్డే బాయ్ మోడీ: కరుడుగట్టిన ఈ బీజేపీ నేత ఒకప్పుడు కాంగ్రెస్లో ఏంచేశారంటే..?
Recommended Video
నరేంద్ర మోడీ... ఈ పేరులో ఏదో వైబ్రేషన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా దేశాధినేతలు సైతం మోడీ అనే పేరును ఎంతో గౌరవిస్తారు. ఒకప్పుడు అమెరికా వెళ్లేందుకు వీసా నిరాకరించిన దేశమే నేడు తమ దేశానికి రావాల్సిందిగా రెడ్కార్పెట్ పరుస్తోంది. అంతలా మోడీ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన నరేంద్రుడు అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేతగా ఎదిగారు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ తన 69వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ
సాధారణంగా కాంగ్రెస్ను ఖతం చేసే పనిలో మోడీ ఉన్నారని చాలా మంది అనుకుంటారు. దీనికి బలం చేకూర్చేలా గత రెండు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆ పార్టీ అత్యల్ప సీట్లు గెలిచింది. దీంతో మోడీ కాంగ్రెస్ను దేశంలో లేకుండా చేశాడనే అభిప్రాయం చాలామందిలో నెలకొంది. అంతేకాదు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచేందుకు కావాల్సిన సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. ఇక మోడీ చిన్నతనంలో గుజరాత్లోని వాద్నగర్లో కాంగ్రెస్ వాలంటీర్గా పనిచేశారన్న సంగతి చాలా కొద్దిమందికే తెలిసి ఉంటుంది. ఆర్ఎస్ఎస్లో వాలంటీర్గా పనిచేస్తూనే కాంగ్రెస్ నేత రసిక్భాయ్ దవే ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో తరచూ పాల్గొనేవారని మోడీ బయోగ్రఫీ రాస్తున్న వారు తెలిపారు. మోడీకి అప్పుడు ఆరేళ్ల వయసుండేదని వారు రాశారు.
వాద్నగర్లో ఏ కాంగ్రెస్ కార్యక్రమం జరిగినా ప్రత్యక్షమయ్యే మోడీ
1956లో కాంగ్రెస్ నేత రసిక్భాయ్ దవే... ఓ కాంగ్రెస్ కార్యక్రమంను ఏర్పాటు చేయగా అక్కడికి ఆరేళ్ల మోడీ వెళ్లినట్లు పుస్తకం రాస్తున్న వారు తెలిపారు. అయితే ఆరేళ్ల బాలుడికి రాజకీయ కార్యక్రమంతో ఏంపని అని రసిక్భాయ్ ప్రశ్నించగా.. ఇక్కడ కాంగ్రెస్ బ్యాడ్జీలు అమ్ముతానని లేదంటే పంచుతానని మోడీ సమాధానం చెప్పాడట. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారికి బ్యాడ్జీలు అమ్మి డబ్బులు సమకూర్చుకున్నారు మోడీ. ఇలా వాద్నగర్లో కొన్ని కార్యక్రమాల్లో మోడీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషించేవారని రచయితలు తమ పుస్తకంలో రాశారు. ఈ విషయాన్ని మరో కాంగ్రెస్ నేత ద్వారకాదాస్ జోషి రచయితలకు చెప్పారట. మోడీ కాంగ్రెస్ కార్యక్రమాల్లో బ్యాడ్జీలు అమ్మి ఆ డబ్బును ఇతర కాంగ్రెస్ కార్యక్రమాలకు వినియోగించేవారట.
ఆర్ఎస్ఎస్లో ఉన్నా కాంగ్రెస్ వారితో దోస్తీ
వినోభాబావేకు అనుచరుడైన ద్వారాకాదాస్ జోషి సర్వోదయా విధానాలను పాటించేవారు. 2009లో ఆగష్టు 15 నుంచి సెప్టెంబర్ 4వరకు ఉపవాసం చేసి మరణించారు. మొత్తం 21 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నారు. ద్వారకాదాస్ జోషి మృతదేహానికి మోడీ నివాళులు అర్పించారు. ఇక క్రమంగా ఆర్ఎస్ఎస్లో ఎదుగుతున్న సమయంలో కూడా కాంగ్రెస్ నేత రసిక్భాయ్ దవేతో సత్సంబంధాలు కొనసాగించారు మోడీ. ఇక ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి మోడీ వెళ్లారని రసిక్భాయ్ దవే భార్య సరలాబెన్ చెప్పినట్లు రచయితలు తమ పుస్తకంలో రాశారు. 1999లో మోడీ బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో వాద్నగర్లోని మోడీ చదివిన పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది. మోడీని కూడా ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి హాజరైన మోడీ... వేదికపై ఉన్న రసిక్భాయ్, సరలాబెన్ దంపతులకు పాదాభివందనం చేసినట్లు మోడీ బయోగ్రఫీ "ద మ్యాన్ ఆఫ్ ది మోమెంట్: నరేంద్ర మోడీ" రాస్తున్న రచయితలు ఎంవీ కామత్, కలింది రందేరీలు పేర్కొన్నారు.