10 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం.. ఇంటర్ పరీక్షల నిర్వహణపై అయోమయం
ఇంటర్ పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొందా? 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారనుందా? ఫిబ్రవరి 27 నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయా? బోర్డు అధికారుల నిర్లక్ష్యంతో ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితి నెలకొంది.
ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇంకా 2 నెలల సమయమే మిగిలి ఉంది. కానీ దానికి సంబంధించిన ప్రక్రియ నత్తనడక నడుస్తోంది. వారమో, పదిహేను రోజులో కాదు.. గత ఏడాదితో పోలిస్తే 40 రోజుల ఆలస్యం జరిగింది. ఏర్పాట్లలోనే ఇంత ఆలస్యం జరిగితే అసలు పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇంటర్ పరీక్షలు.. డేంజర్ బెల్
ఇంటర్మీడియట్ పరీక్షలకు ఫిబ్రవరి 27 నుంచి షెడ్యూల్ ప్రకటించింది బోర్డు. అయితే డిసెంబర్ నెల పూర్తికావొస్తున్నా.. దానికి సంబంధించిన నిర్వహణ ప్రక్రియ మాత్రం ఊపందుకోకపోవడం గమనార్హం. గతేడాది కంటే 40 రోజులు బోర్డు వెనుకబడిపోయింది. కొందరి అధికారుల వ్యవహారశైలి, సాఫ్ట్వేర్ ఇబ్బందులు వెరసి ఇంటర్ పరీక్షలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు ప్రశ్నపత్రాల ముద్రణ ఊసేలేకపోవడం గమనార్హం. దీంతో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్న ఇంటర్ పరీక్షలపై ఆందోళన నెలకొంది. అదలావుంటే ఇంటర్ పరీక్షల నిర్వహణపై డిసెంబర్ నెల బోర్డుకు కీలక సమయం. అలాంటిది ఓ కీలక అధికారి సెలవుపై వెళ్లడం గమనార్హం. వీటన్నింటి నేపథ్యంలో ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27 నుంచి పరీక్షలు జరుగుతాయో లేదోననే సందేహాలు వినిపిస్తున్నాయి.
షెడ్యూల్ ఏంటి.. జరుగుతున్నదేంటి?
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఏయే సమయంలో ఏమేమి పనులు జరగాలనేదానిపై షెడ్యూల్ వేస్తారు. అయితే దాని ప్రకారం ఇప్పటివరకు కాలేజీల నామినల్ రోల్స్ పూర్తికావాలి. కానీ అది జరగలేదు. అంతేకాదు ఎంతమంది పరీక్షలు రాయబోతున్నారు, సెంటర్లు ఎన్ని, ఏ సెంటర్లో ఎంతమంది హాజరవుతారు అనే లెక్కలు తేల్చాలి. అదీ జరగలేదు. సబ్జెక్టు గ్రూపులవారీగా విద్యార్థుల లెక్క తేలితే గానీ.. ప్రశ్నపత్రాల ముద్రణ ప్రారంభం కాదు. అసలు క్వశ్చన్ పేపర్స్, ఆన్సర్ షీట్స్ ముద్రణకు సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా రూపుదాల్చలేదని తెలుస్తోంది. ఇంతటి గందరగోళం నేపథ్యంలో ఇంటర్ పరీక్షల నిర్వహణ సజావుగా జరిగేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నీ తప్పులేనా.. బోర్డు గట్టేక్కేనా?
అదలావుంటే అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన నుంచి సాఫ్ట్వేర్ సమస్యలు ఇంటర్ బోర్డును వెంటాడుతున్నాయి. ఆది నుంచి తప్పుల తడకలే ఉన్నాయనే ఆరోపణలొస్తున్నాయి. దీంతో హాల్ టికెట్లు సరిగా ప్రింటవుతాయో లేదోననే అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పుడే ఇన్నీ సమస్యలుంటే పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో ఇంకెన్ని తప్పులు దొర్లుతాయోననే సందేహాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించి బోర్డు గట్టెక్కుతుందా లేదంటే అపహస్యం పాలవుతుందా అనే చర్చ జరుగుతోంది.