కుల్భూషణ జాదవ్ కేసులో ఈ నెలలోనే తీర్పు ఇవ్వనున్న అంతర్జాతీయ న్యాయస్థానం
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాకిస్తాన్ జైలులో శిక్ష పొందుతున్న కుల్భూషణ్ జాదవ్ కేసులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ నెలలోనే తీర్పు ఇవ్వనున్నట్లు సమాచారం. భారత నేవీలో రిటైర్డ్ అయిన కుల్భూషణ్ జాదవ్కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించింది. గూఢచర్యంకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2017 ఏప్రిల్లో తీర్పు ఇచ్చింది. దీంతో మే 2017లో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంను ఆశ్రయించింది. కుల్భూషణ్ జాదవ్ను భారత కాన్సులేట్కు రానివ్వకుండా పాకిస్తాన్ అడ్డుకుంటోందంటూ కోర్టులో భారత్ తన వాదనలు వినిపించింది. అంతేకాదు పాకిస్తాన్ అన్యాయంగా కుల్భూషణ్ జాధవ్ పై నేరారోపణలు చేసిందని కోర్టు దృష్టికి భారత్ తీసుకొచ్చింది. అయితే కేసు విచారణ ముగిసేవరకు కుల్భూషణ్ జాదవ్కు విధించిన మరణశిక్ష నిలిపివేయాలని కోరుతూ 2017 మే 18న అంతర్జాతీయ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఇక ఫిబ్రవరి 2018లో అంతర్జాతీయ కోర్టు నాలుగు రోజుల పాటు రెండు దేశాల తరపున వాదనలు వినింది. కాన్సులర్ యాక్సెస్ పై వియన్నా కన్వెన్షన్ను పాక్ ఉల్లంఘించడమే కాకుండా సమస్య పరిష్కార ప్రక్రియను కూడా ఉల్లంఘించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది భారత్. అంతేకాదు కుల్భూషణ్ జాదవ్ పై పాక్ విధించిన మరణదండనను రద్దు చేసి సత్వరమే విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది. మరో వైపు కుల్భూషణ్ జాదవ్ గూఢచర్యంకు పాల్పడ్డారని అతను వ్యాపారవేత్త కాదని పాక్ వాదించింది. బలోచిస్తాన్ నుంచి పాక్ బలగాలు జాదవ్ను అదుపులోకి తీసుకున్నాయని తెలిపాయి.ఇరాన్ నుంచి అక్రమంగా ఆయన పాక్ భూభాగంలోకి ప్రవేశించాడని తెలిపింది.
మరోవైపు కుల్భూషణ్ జాదవ్ను పాక్ బలగాలు ఇరాన్ నుంచి కిడ్నాప్ చేశాయని... నేవీలో రిటైర్ అయిన తర్వాత సొంత వ్యాపారం నిమిత్తం ఆయన ఇరాన్కు వెళ్లారని భారత్ వెల్లడించింది. కుల్భూషణ్ జాదవ్ను పాక్ అరెస్టు చేయడంతో భారత్ ఒక్కసారిగా భగ్గుమందని భారత్ కోర్టుకు వెల్లడించింది. అయితే భారత కాన్సులేట్కు పంపాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని భారత్ కోర్టును కోరగా.. అందుకు పాక్ తిరస్కరించింది. గూఢచర్యంకు పాల్పడిన కుల్ భూషణ్ జాదవ్ తాను సేకరించిన సమాచారంను భారత అధికారులకు తెలిపే ప్రమాదం ఉన్నందున అతన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత కాన్సులేట్కు పంపలేమని తేల్చిచెప్పింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 25, 2017లో తన తల్లి భార్యను ఇస్లామాబాదులో కలిసేందుకు అనుమతిచ్చింది పాక్.