దేశ రాజధానిలో భారీ డ్రగ్స్ రాకెట్: రూ.1,300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్, 3దేశాల నిందితుల అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. వారి వద్ద నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధానిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ బయటపడటం కలకలం రేపింది.
20కిలోల కొకైన్..
ముందస్తు సమాచారంతోనే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ అంతటా విస్తరించిన ఈ డ్రగ్ సిండికేట్ నుంచి సుమారు 20 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లో ఉన్న ఈ సిండికేట్కు ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్, నైజీరియా, శ్రీలంక, కొలంబియా, మలేషియా సహా పలు దేశాలతో సంబంధాలున్నాయని అధికారులు గుర్తించారు.
మూడు దేశాల నిందితులు..
ఐదుగురు భారతీయుల తోపాటు అమెరికా, ఇండోనేషియా జాతీయులు ఇద్దరు, నైజీరియాకు చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కొకైన అంతర్జాతీయ రవాణాకు ఈ సిండికేట్ను నిందితులు గమ్యస్థానంగా ఉపయోగించుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
రూ. 1300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
మనదేశంలో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ అంతర్జాతీయంగా రూ. 1000 కోట్లు ఉంటుందని, ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం మాదక ద్రవ్యాల విలువ రూ. 1300 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇది ఇలావుంటే, ఆస్ట్రేలియాలో అక్కడి అధికారులు నిర్వహించిన ఆపరేషన్లో 55 కిలోల కొకైన్, 200 కిలోల ఇతర మత్తు పదార్థాలు గుర్తించారు. ఆ మొత్తం డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల్లోనే..
మనదేశంలోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్కతా లాంటి ప్రధాన నగరాల్లో డ్రగ్స్ రాకెట్లు తరచూ బయటపడుతున్న విషయం తెలిసిందే. పోలీసులు కొంత నిఘా ఎక్కువగా పెట్టడంతో ఈ మధ్య కాస్త తగ్గించినట్లే అనిపించినా.. రహస్యంగా డ్రగ్స్ రాకెట్ నిర్వహకులు తమ పని తాము కానిచ్చేస్తున్నట్లు ఈ భారీ డ్రగ్స్ రాకెట్ ద్వారా తెలుస్తోంది. గత కొంత కాలం క్రితం హైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్లో పలువురు సినీ ప్రముఖుల పేర్లు వినిపించడం విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో కొంతమందిని అధికారులు విచారించి, వదిలేశారు.