కరోనా ఎఫెక్ట్: నిషేధం పొడిగింపు, అంతర్జాతీయ విమానాలు మరో నెలపాటు ఎగరవు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా రద్దయిన అంతర్జాతీయ విమాన సేవలు ఇప్పట్లో మొదలయ్యేట్లు కనిపించడం లేదు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని విమానయాన రంగం నియంత్రణ సంస్థ(డీజీసీఏ) మరో నెలపాటు పొడిగించింది.
విదేశీ ప్రయాణాలపై జులై 31 వరకు ఉన్న నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. కేవలం ప్రయాణికుల విమానాలకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుంది. సరుకు రవాణా విమానాలకు, డీజీసీఏ అనుమతించిన విమానాలపై నిషేధం ఉండబోదని స్పష్టం చేసింది.
కరోనా నేపథ్యంలో దేశంలో మార్చి నెలలో విదేశీ విమానయాన సర్వీసులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశీయ విమాన సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంది.
అయితే, ఒప్పందం చేసుకున్న అమెరికా, ఫ్రాన్స్ దేశాలకు ప్రస్తుతం విమానాలు నడుస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని దేశాలతో భారత్ ఈ తరహా ఒప్పందాలు చేసుకునే అవకాశాలున్నాయి.
కాగా, కరోనా లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందేభారత్ మిషన్ కింద విమానాలు నడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు విదేశాల్లో చిక్కుకున్న ఏడు లక్షల మందికిపైగా భారతీయులను స్వదేశానికి తీసుకురావడం జరిగింది.