అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం... నవంబర్ 30 వరకు పొడగింపు...
అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 వరకు పొడగించింది. స్వదేశం నుంచి విదేశానికి,విదేశం నుంచి స్వదేశానికి వచ్చే విమాన రాకపోకలపై నిషేధం కొనసాగనుంది. అదే సమయంలో ఇంటర్నేషనల్ కార్గో కార్యకలాపాలు,కొన్ని ప్రత్యేక రూట్లలో డీజీసీఏ అనుమతినిచ్చిన విమాన సర్వీసులు కొనసాగనున్నాయి. ఈ మేరకు డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) బుధవారం(అక్టోబర్ 28) ఒక ప్రకటనలో వెల్లడించింది.
Recommended Video
గతంలో డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ... పూర్తి స్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్దరణ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ చాలా దేశాలు క్వారెంటైన్ జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నాయని... కాబట్టి అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్దరణకు మరికొంత కాలం పట్టవచ్చునని ఆ సందర్భంగా పేర్కొన్నారు.
చివరిసారిగా సెప్టెంబర్ 30 అంతర్జాతీయ విమాన సర్వీసులపై విమానాయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31 వరకూ నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా ఉత్తర్వులతో దాన్ని మరో నెల రోజులకు పొడగించారు. కరోనా వ్యాప్తితో మార్చి 23 నుంచి దేశంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించారు. అయితే విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్తో విమాన సర్వీసులను నడుపుతున్న సంగతి తెలిసిందే.
అన్లాక్ 5 మార్గదర్శకాలను కూడా కేంద్రం నవంబర్ 30 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. గత నెల ఇచ్చిన ఆ మార్గదర్శకాల్లో సినిమా హాళ్లు,మల్టిప్లెక్సులకు కేంద్రం సడలింపులనిచ్చింది. 50శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా థియేటర్లు,మల్టిప్లెక్సుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అక్టోబర్ 15 నుంచి కాలేజీలు,స్కూళ్లు కూడా రీఓపెన్ చేసుకోవచ్చునని... అయితే దానిపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.