International Tigers Day:ప్రమాదపుటంచుల్లో పులులు.. దేశంలో ఎన్ని ఉన్నాయో తెలుసా..?
ఈ రోజు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. భారత దేశపు జాతీయ జంతువు పులి. అయితే దేశంలో ఎన్ని పులులు ప్రాణాలతో బతికి ఉన్నాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పులులను సంరక్షించేందుకు ప్రభుత్వం పులుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే మూడు పులుల్లో ఒక పులి సంరక్షణ కేంద్రాల బయటే జీవిస్తున్నాయంటూ స్టేటస్ ఆఫ్ టైగర్స్ కో-ప్రిడేటర్స్ అండ్ ప్రే ఇన్ ఇండియా అనే నివేదిక తెలుపుతోంది. అంతేకాదు మానవుడు-పులి మధ్య ఘర్షణను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ నివేదిక ప్రస్తావించింది. ఇలా జనావాసాల్లోకి వస్తున్న పులులకు భయపడి మనుషులు వీటిని అంతమొందిస్తున్నారని తద్వారా పులుల సంఖ్య దేశంలో గణనీయంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు.
33శాతం మేరా పెరిగిన పులుల సంఖ్య
2014 నుంచి 2018 వరకు భారత్లో పులుల సంఖ్య 33శాతం మేరా పెరిగిందని ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ రిజల్ట్ వెల్లడించిన నివేదిక ద్వారా తెలుస్తోంది. 2014లో 2,226 పులులు ఉండగా 2018 నాటికి అది 2967కు చేరుకుందని నివేదిక వెల్లడించింది. ఇక పులుల సంరక్షణ కేంద్రాల్లో పులుల సంఖ్య 1923 ఉండగా మరో 35శాతం పులులు సంరక్షణ కేంద్రాలకు దూరంగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది. కార్బెట్ టైగర్ రిజర్వ్లో మాత్రమే అత్యధికంగా 231 పులులు ఉన్న 2018 రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే మధ్యప్రదేశ్లో 526 పులులు ఉండగా కర్నాటకలో 524 పులులు, 442 పులులు ఉత్తరాఖండ్లలో ఉన్నాయి. కార్బెట్ టైగర్ రిజర్వ్లో అత్యధిక పులుల సాంద్రత ఉన్నట్లు సమాచారం. 100 చదరపు అడుగుల్లో 14 పులులు ఉన్నాయని నివేదిక చెబుతోంది.
ప్రకాష్ జవదేకర్ ట్వీట్
ఇక అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ట్వీట్ చేశారు. ప్రాజెక్టు టైగర్ 1973లో 9 పులుల సంరక్షణ కేంద్రాలతో ప్రారంభమైందని ఈరోజు భారత్లో 50 పులుల సంరక్షణ కేంద్రాలున్నాయని ఇందులో 2967 పులులు ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేస్తూ ఓ వీడియోను పోస్టు చేశారు.
రెండో స్థానంలో కర్నాటక
కర్నాటక పర్యావరణానికి పెట్టింది పేరని ట్వీట్ చేశారు కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. జాతీయ పార్కులు టైగర్ రిజర్వ్లు ఇక్కడ చాలా ఉన్నాయని చెప్పిన యడియూరప్ప దేశంలో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రంగా కర్నాటక రెండో స్థానంలో ఉన్నందుకు గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. పులులను సంరక్షించుకునేలా ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఇక ప్రాజెక్ట్ టైగర్ను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారని కాంగ్రెస్ ట్విటర్లో పోస్టు చేసింది. అంతేకాదు పులుల సంరక్షణతో పాటు దాని నివాస ప్రాంతాలను కూడా కాపాడుతామనే తీర్మానం తీసుకుంటున్నామని అదే సమయంలో అవగాహన కూడా కల్పిస్తామని కాంగ్రెస్ పేర్కొంది.
ఇందిరాగాంధీ హయాంలో ప్రాజెక్ట్ టైగర్
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ప్రాజెక్ట్ టైగర్ తీసుకురావడం జరిగిందని ట్వీట్ చేసింది ఆలిండియా మహిళా కాంగ్రెస్. పులులను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ప్రతిజ్ఞ చేసింది ఆలిండియా మహిళా కాంగ్రెస్. ఇందిరాగాంధీ ప్రారంభించిన ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూ వస్తోందని మహిళా కాంగ్రెస్ వెల్లడించింది.
సుదర్శన్ పట్నాయక్ ట్వీట్
పులులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొంటూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్లో శాండ్ఆర్ట్ ద్వారా పులిని వేసిన ఫోటోను ట్విటర్ వేదికగా పోస్టు చేశారు.