నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం..!తెలంగాణలో పులుల సంఖ్య పెరిగిందన్న మంత్రి..!!
ఢిల్లీ/హైదరాబాద్: అందరికి ఏదో రోజు ఉన్నట్టు మృగ రాజుకు కూడా ఓరోజు అంటూ ఉంది. అదే అంతర్జాతీయ పులుల దినోత్సవం. ఈ దినాన్ని పురస్కరించుకొని పులుల సంరంక్షకణ, వాటి సంతతి వృద్దికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల గురించి ప్రణాళికలు రచిస్తుంటారు ప్రభుత్వ పెద్దలు. దేశ ప్రధాని మోదీ భారత దేశంలో ఉన్న పులుల లెక్కల గురించి ప్రస్తావించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పులుల అంచనా జాబితాను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేశారు. భారత్లో 2,967 పులులు ఉన్నట్లు అంచనా వేశారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత్లో దాదాపు 3 వేల పులులు ఉన్నాయని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. పులుల ఆవాసానికి ప్రపంచంలోనే భారత్ అనువైన ప్రాంతం అని మోదీ పేర్కొన్నారు. దేశంలో క్రమంగా పులుల జనాభా పెరిగిపోతోంది. 2006లో 1,411, 2010లో 1,726, 2014లో 2,226 పులులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 2,967కు చేరుకుంది. ప్రతి నాలుగేండ్లకు ఒకసారి పులుల గణన చేపడుతారు.ఇదిలా ఉండగా తెలంగాణలో పులుల సంఖ్య పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్-2018ను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
ఈ నివేదిక ప్రకారం తెలంగాణ అడవుల్లో 26 పులులు ఉన్నట్లు తేలిందని మంత్రి తెలిపారు. గతంలో 20 పులులు ఉన్నట్లు ఓ అంచనా ఉండేదని, రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ చేపట్టిన అటవీ రక్షణ చర్యల వల్లే పులుల సంఖ్య పెరిగేందుకు దోహదపడ్డాయని మంత్రి పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో పులుల అభివృద్దికి మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా వాటి రక్షణ కోసం వ్యవస్థను కట్టుదిట్టం చేస్తామని చెప్పారు. పులి చర్మం,గోళ్ల కోసం వాటిని చంపే వారి పట్ల శిక్షలను కఠిన తరం చేస్తామని మంత్రి తెలియజేపారు.