Omicron భయాలు-ఇక ఆ దేశాల నుంచి వస్తే వ్యాక్సిన్లతో పాటు కరోనా పరీక్షలూ తప్పనిసరి
కరోనాలో ఇప్పటికే రెండు వేవ్ ల బారిన పడిన భారత్ ను తాజాగా ఓమిక్రాన్ వైరస్ భయాలు వెంటాడుతున్నాయి. ఎక్కడ ఏ చిన్న తప్పిదం జరిగినా ఓమిక్రాన్ కొత్త వేరియంట్ చుట్టుముట్టడం ఖాయమని భావిస్తున్న కేంద్రం.. రోజురోజుకీ దీన్ని కట్టడి చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ఆంక్షలు పెంచుకుంటూ పోతోంది.
ఇప్పటికే ఓమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులకు కరోనా వ్యాక్సిన్లు తప్పనిసరి చేసిన కేంద్రం.. ఇప్పడు తాజాగా వారికి కరోనా పరీక్షలు కూడా తప్పనిసరి చేసింది. వారు భారత్ లో అడుగుపెట్టగానే కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని నిబంధన విధించింది. ఈ మేరకు ప్రస్తున్న ఉన్న పర్యాటక నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ సవరించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, 'ప్రమాదంలో ఉన్న' దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికులందరూ (టీకా స్థితితో సంబంధం లేకుండా) విమానాశ్రయంలో తప్పనిసరిగా కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలని ఆదేశించింది.
దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) నవంబర్ 25న ఓమిక్రాన్ వైరస్ వేరియంట్ ను గుర్తించినట్లు ప్రకటించింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ దక్షిణాఫ్రికాతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఆఫ్రికా దేశాల నుంచిసైతం ప్రయాణికుల్ని తమ దేశంలోకి అనుమతించడం లేదు. పలు ఆంక్షలతో అనుమతించేందుకు కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇదే కోవలో భారత్ కూడా గతంలో ఇచ్చిన మినహాయింపుల్ని రద్దు చేసింది. ఇప్పుడు వ్యాక్సిన్లతో పాటు కరోనా పరీక్షలను కూడా తప్పనిసరి చేసింది. పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేకపోతే ఆయా దేశాల నుంచి పూర్తిగా ప్రయాణికుల్ని నిరోధించేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గకపోవడం, దక్షిణాఫ్రికాతో పాటు ఓమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి ఇప్పటికే దేశంలోకి పలువురు ప్రయాణికులు వచ్చినట్లు భావిస్తుండటంతో ఆంక్షల్ని కేంద్రం పెంచుతున్నట్లు తెలుస్తోంది. గత నెల రోజుల్లో ఆయా దేశాల నుంచి వచ్చిన వారి జాబితాను కూడా సేకరిస్తోంది.