యోగా డే: గాలిలో దాడులకు ప్లాన్, హై అలర్ట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా డే వేడుకల సందర్బంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని, జాగ్రతగా ఉండాలని ఢిల్లీ పోలీసులను ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబి) అధికారులు హెచ్చరించారు. ఢిల్లీలో ఇప్పటికే హై అలర్టు ఆదేశాలు జారీ చేశారు.
రాజ్ పథ్ ఆవరణంలో అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే యోగా డే ఉత్సవాలు జరిగే సమయంలో ఆకాశంలో బెలున్లూ, గాలిపటాలు లాంటి వాటి ద్వారా దాడులు చెయ్యాలని ఉగ్రవాదులు ప్లాన్ వేస్తున్నారని ఐబి అధికారులు పసిగట్టారు.
ఈ విషయం ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. యోగా డే సందర్బంగా గాలిపటాలు, బెలూన్లుతో పాటు గాలిలో ఎగిరే ఎలాంటి వస్తువులు ఎగరవేయరాదని, వాటిని నిషేదిస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదిన అంతర్జాతీయ యోగా డే అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా యోగా డే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగా చెయ్యనున్నారు.
30 కంపెనీల మిలటరి బలగాలు, 5 వేల మంది సాయుధ బలగాలతో పాటు ఢిల్లీ పోలీసులు రాజ్ పథ్ ను చుట్టు ముట్టి భద్రత కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులతో పాటు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ, ప్రయివేటు అధికారులు, విద్యార్థులు పాల్గోంటున్నారు.
సుమారు 35 వేల మందితో యోగా డే నిర్వహించడానికి అన్ని సిద్దం చేశారు. ఇలాంటి కార్యక్రమానికి ఎలాంటి అడ్డంకులు రాకుండ శాంతియుతంగా పూర్తి చెయ్యడానికి పోలీసు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.