మోడీ..ట్రంప్..మెలానియా: ఈ ముగ్గురి వెంట రెడ్ కార్పెట్పై భారతీయ మహిళ: ఆమె ఎవరో తెలుసా?
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన వెన్నంటే కనిపించారు ఓ భారతీయ మహిళ. డొనాల్డ్ ట్రంప్..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అమెరిక ప్రథమ మహిళ మెలానియా ట్రంప్లతో కలిసి రెడ్ కార్పెట్ మీద నడిచారు. ఇద్దరు శక్తిమంతమైన నాయకుల మధ్య కనిపించిన ఆ మహిళ.. ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయారు. ఆమె ఎవరనే విషయాన్ని ఆరా తీస్తున్నారు నెటిజనం.
Recommended Video
ఆమే- గుర్దీప్ కౌర్ చావ్లా. భారత సంతతికి చెందిన మహిళ. అమెరికాలో నివాసం ఉంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనువాదకురాలిగా పని చేస్తున్నారు. అమెరికా ట్రాన్స్లేషన్ అసోసియేషన్ సభ్యురాలు కూడా. ఒక్క మోడీ వద్దే కాదు- ఏడుమంది ప్రధానమంత్రుల వద్ద ఆమె అనువాదకురాలిగా పని చేశారు. వీపీ సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహా రావు, అటల్ బిహారీ వాజ్పేయి, ఐకె గుజ్రాల్, మన్మోహన్ సింగ్ల వద్ద పని చేశారు.
ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్లినా.. ఆయన వెంటే ఉండటం ఆమె ప్రధాన విధి. ఆయన హిందీ ప్రసంగాన్ని అప్పటికప్పుడు ఇంగ్లీషులో అనువదించి ఆ దేశ ప్రభుత్వ తరఫు ప్రతినిధులకు వివరిస్తారు. గతంలో భారత పర్యటనకు వచ్చిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడోకు తన సేవలను అందించారు. ప్రధానమంత్రి ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశం, మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఈవెంట్, విదేశాంగ మంత్రుల మండలి భేటీ.. వంటి కీలక సందర్భాల్లో ప్రధానికి భాషానువాదంలో సహకరించారు.
1990లో ఎంపీగా ఆమె తన పొలిటికల్ కేరీర్ను ఆరంభించారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లిపోయింది. కుటుంబంతో పాటు ఆమె కూడా అమెరికాలో నివసిస్తున్నారు. దాదాపు అన్ని ప్రధాన భాషల మీద ఆమెకు మంచి పట్టు ఉంది. అదే ఆమెను ఆ స్థాయికి చేర్చింది. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్, మెలానియా ట్రంప్, నరేంద్ర మోడీలతో పాటు రెడ్ కార్పెట్పై నడిచిన ఫొటో ఒకటి ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.