కిరణ్ బేడీని ప్రకటించకపోయినా బిజెపి ఓడేది: ఆప్ నేత పృథ్వీరెడ్డితో ఇంటర్వ్యూ
బెంగళూరు/న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విజయం సాధించింది. భారీ విజయాన్ని కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలకు, ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీపై ఉంది. ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు పృథ్వీరెడ్డి పార్టీ భారీ విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వన్ ఇండియాతో మాట్లాడారు.
ఆప్ది స్ఫూర్తిదాయక నాయకత్వమని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ కూడా తమ ప్రచారానికి సహకరించిందని చెప్పారు. వన్ ఇండియా ఇంటర్వ్యూలో పృథ్వీరెడ్డి ఢిల్లీ ఫలితాలపై చర్చించారు. ప్రజలు తమ పార్టీతో ఎలా కలిసి వచ్చారనేదానిపై వివరించారు.
మీరు ఈ భారీ విజయాన్ని ఊహించారా?
‘మేము ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేస్తామనే నమ్మకముండేది. అయితే మాకు ఇంత భారీ విజయం వస్తుందని మాత్రం ఊహించలేదు. ఢిల్లీ ప్రజలు మా పట్ల సానుకూలంగా ఉన్నందునే మాకు ఈ భారీ విజయాన్ని కట్టబెట్టారు' అని పృథ్వీరెడ్డి అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఉపాయమేంటి?
‘మేము సామాన్యులను భాగస్వాములను చేసుకునొని సరికొత్త రాజకీయాలకు తెరతీశాం. మా మేనిఫెస్టో కూడా సామాన్యులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసిందే. మా ప్రభుత్వంపై నమ్మకమున్నందువల్లే ఢిల్లీ ప్రజలు మాకు పూర్తి మద్దతుగా నిలిచారు.'
‘49 రోజులపాటు ప్రత్యర్థులు విస్తృత ప్రచారం చేసి, విమర్శలు గుప్పించారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ చాలా తక్కువ కాలంలో ప్రజలకు చేరువైంది. అరవింద్ కేజ్రివాల్ ఈసారి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పారు. దీంతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ధీమాగా ఉన్నాం. ఆప్పై ప్రజలకు ఉన్న నమ్మకం చెక్కు చెదరకపోవడమే ఈ విజయానికి నిదర్శనం.'
ఈసారి ప్రచారంలో భిన్నంగా ఏముంది?
'మా ప్రచారంలో మరీ కొత్తదనమేమి లేదు. ఇది ప్రజాస్వామ్య విజయం. ప్రజలే పాలితులుగా ఉండాలి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మా ప్రచారాన్ని కొనసాగించాం. ఈ ప్రచారంతో ప్రజలు మా వెంట నడిచారు. మాది నూతన పార్టీ, నెరవేర్చగలిగే హామీలు ఇచ్చాం. మాకు అనూహ్య విజయాన్ని కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు'.
తప్పులను ఆప్ తెలుసుకుంటుందా? మరోసారి తప్పుకుంటుందా?
మాది యంగ్ పార్టీ. మేము నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తప్పుకోవడం తప్పే. మళ్లీ అలాంటి తప్పు చేయం.
మేము ఆప్ వర్షన్ 2 చూస్తున్నామా?
‘అదేం కాదు. మా పార్టీ మారదు. ఇంతకుముందు తప్పు చేశాం. ఆ తప్పు నుంచి నేర్చుకున్నాం. మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాం. మా తప్పులను తెలుసుకుంటూ, వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్తాం. ఆప్ ఒక స్ఫూర్తిదాయక నాయకత్వం. సాంప్రదాయ రాజకీయాలకు దూరం.'
కిరణ్ బేడీ లేదా షాజియా ఇల్మి లాంటి వారు ఆప్కి ఫేవర్ చేశారా?
‘దాని గురించి నాకు తెలియదు. కిరణ్ బేడీని సిఎం అభ్యర్థిగా ప్రకటించకపోయినా బిజెపి ఓడిపోయి ఉండేది. బిజెపిలో సిఎం పదవి కోసం పోటీ పడేవారు చాలా మంది ఉన్నారు. వారు ఒకరినొకరు కిందకు లాక్కున్నారు. మేము సరికొత్త రాజకీయాలపైనే దృష్టి సారించాం. ఇదే మా విజయానికి కారణం. ఇది నిజమైన ప్రజాస్వామ్య విజయం.'
ఎన్నికల ముందు జామా మసీదు షాహీ ఇమామ్ ఆప్ పార్టీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అయితే దాన్ని ఆప్ తిరస్కరించింది. ఏదైనా కారణముందా?
‘అది బిజెపి ఏర్పాటు చేసిందే. మాకు తెలుసు. ఎవరికి ఓటేయాలనే అంశాన్ని ప్రజలకు తెలియజేసిన బిజెపికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. బిజెపి కూడా తెలుసుకోవాలని అలాంటి రాజకీయాలు ప్రజలు తిరస్కరిస్తున్నారని. మాకు సామాన్యుల మద్దతు అమితంగా ఉంది.'
ఢిల్లీకి ఆప్ నిర్ధిష్ట పార్టీగా మారే అవకాశం ఉందా?
‘అలా ఏం కాదు. ఇది ఆరంభం మాత్రమే. మాకు ఇప్పుడు తక్కువ వనరులున్నాయి. మేము మా బలాన్ని దేశవ్యాప్తంగా నిరూపించుకుంటాం. ఇప్పుడైతే ఢిల్లీపైనే దృష్టిపెట్టాం. మేమిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఢిల్లీలో లాగే ఇతర రాష్ట్రాల్లో ఉండకూడదని తెలుసుకున్నాం' అని పృథ్వీరెడ్డి తెలిపారు.