అసహనం: షారుక్, అమీర్, సల్మాన్ తర్వాత అక్షయ్
ముంబై: ఇటీవల దేశంలో అసహనం ఉందంటూ పలువురు వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్పందించాడు. అసహనంపై బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్పందించిన అక్షయ్ కుమార్.. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటే మంచిదని అన్నారు. ‘భారతదేశం ఎప్పుడూ తన సహన శీలతను చాటుతూనే ఉంటుంది. మనం ఎప్పుడూ శాంతిని కోరుకుంటాం. కానీ, పఠాన్కోట్ దాడి లాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం మనం ప్రతిఘటించక తప్పదు' అని పేర్కొన్నారు.
‘సోషల్ మీడియాలో గమనించినట్లయితే మన దేశ యువతరం ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. మనం కూడా శత్రు దేశంపై దాడి చేయాలంటూ పిలుపునిస్తున్నారు' అని ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ అన్నారు.
‘నా వద్ద ఎలాంటి పరిష్కార మార్గం లేదు. అయితే, మనదేశంపై దాడి చేసి, మన సైనికులను హతమార్చినందుకు.. మనం కూడా వారి దేశంలోకి ప్రవేశించి దాడికి కారణమైన వారిని మట్టుబెట్టాల్సిన అవసరం ఉంది' అని అక్షయ్ పేర్కొన్నాడు.