అది ఓ జోక్: అసహనం స్పందించిన కరణ్జోహార్
జైపూర్: ప్రముఖ బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ తర్వాత బాలీవుడ్ నిర్మాత కరణ్జోహార్ అసహనంపై స్పందించి వివాదాస్పదమయ్యారు. భారత దేశంలో ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ ఉందనేది పెద్ద జోక్ అని కరణ్జోహార్ అన్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో జరుగుతున్న జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘భారత్లో అసహనంపై జరిగిన చర్చలో మీరు ఎందుకు భాగస్వాములు కాలేదంటూ' ఆయనను మీడియా ప్రశ్నించగా.. పై విధంగా వ్యాఖ్యానించారు.
ఏదైనా విషయంపై అభిప్రాయాన్ని చెబితే.. జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. తానొక సినీ నిర్మాత అయినప్పటికీ.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తనకు లేదని చెప్పారు. ఇది విచారం కలిగించే విషయమని అన్నారు.
భారత్లో అసహనం పెరిగిపోయిందని.. వేరే ఏదైనా దేశానికి వెళ్లిపోవాలనిపిస్తోందని తన భార్య అన్నట్లుగా ఇటీవల ఓ కార్యక్రమంలో అమీర్ఖాన్ పేర్కొనడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత షారుక్ కూడా ఈ విధంగానే స్పందించి వివాదాస్పదమయ్యారు. ఈ నేపథ్యంలో కరణ్జోహార్ పైవిధంగా స్పందించడం గమనార్హం.