‘ప్రజలు ఇది కోరుకోవడం లేదు’: సల్మాన్ ఖాన్ మాట
ముంబై: ‘భారతదేశంలో అసహనం'పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తర్వాత మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నోరు విప్పారు. కళా, వినోదాన్ని రాజకీయాలతో ముడిపెట్టరాదని సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
పాకిస్థాన్ గజల్ గాయకుడు గులాం అలీ ముంబై, పుణెల్లో నిర్వహించతలపెట్టిన సంగీత కచేరీని శివసేన అడ్డుకున్న విషయంపై ప్రశ్నించగా సల్మాన్ ఖాన్ పై విధంగా స్పందించారు. ‘ప్రజలు ఇది కోరుకోవడం లేదు' అని అన్నారు. కళా, వినోదానికి ఎల్లలు లేవని ఆయన చెప్పారు.
‘ప్రస్తుతం అన్నీ డిజిటలైజ్ చేయబడ్డాయి. భారతీయులు ప్రతీ వినోదాన్ని చూస్తారు. అది పాకిస్థాన్ నుంచి వచ్చినదైనా సరే. అందువల్ల కళా, వినోదానికి ఎల్లలు లేవు. వినోదాన్ని ప్రతీ సామాన్యుడు కోరుకుంటాడు' అని సల్మాన్ చెప్పారు.
పాకిస్థాన్కు చాలా మంది కళాకారులు భారతదేశంలో పని చేస్తుండటంపై సల్మాన్ స్పందిస్తూ..‘భారత చలన చిత్రంలో పాకిస్థాన్కు చెందిన కళాకారులు అవసరం అనుకుంటే.. వారిని తీసుకోవచ్చు. దానికి ఎవరూ అడ్డుచెప్పబోరు. బాలీవుడ్కు పాకిస్థాన్లో భారీస్థాయిలో అభిమానులున్నారు. అందువల్ల మంచి ఆదాయం కూడా పొరుగుదేశం నుంచి వస్తోంది' అని సల్మాన్ వివరించారు.
షారుక్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరుసటే రోజే సల్మాన్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశంలో అసహనం పెరుగుతోందని ఆరోపిస్తూ పలువురు సినీ కళారంగాలకు చెందిన ప్రముఖులు వారికి అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని షారుక్ సమర్థించారు. అంతేగాక, భారతదేశంలో అసహనం కాదు, తీవ్ర అసహనం ఉందని చెప్పారు.