ఆరవ తరగతి నుంచి యోగా పాఠాలను పుస్తకాల్లో చేర్చండి: NCERT
Recommended Video
ఇకపై ఆరో తరగతి నుంచి పాఠ్యపుస్తకాల్లో యోగాకు సంబంధించిన పాఠ్యాంశాలు చేర్చాలని దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేసింది నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT. స్కూళ్లలో ఫిజికల్ ఎడ్యుకేషన్, క్రీడలు, యోగా ప్రమోట్ చేసేందుకు ఉపయోగపడుతుందని NCERT భావిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలకు మార్గదర్శకాలు పంపినట్లు తెలిపింది. అయితే సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్కూళ్లు మాత్రం తప్పని సరిగా పాటించాల్సి ఉంటుందని ఆదేశాల్లో NCERT పేర్కొంది.
తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నడిచే స్కూళ్లు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని NCERT తెలిపింది. ఆరోగ్యం, ఫిజికల్ ఎడ్యుకేషన్పై ఆయా స్కూళ్లు ఒకటవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు పాఠ్యాంశాలుగా చేర్చాలని అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ రెండు అంశాలకు సంబంధించి సిలబస్ను రూపొందిస్తున్నట్లు NCERT వివరించింది. "పిల్లలందరూ క్రీడల్లో పాల్గొనాలని, సాంప్రదాయ క్రీడలను ఆడాలని అదే సమయంలో యోగా ఇతరత్ర సామాజిక అంశాల్లో పాల్గొనాలని" గైడ్ లైన్స్ జారీ చేసింది NCERT.
ఇదిలా ఉంటే ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇప్పటి నుంచే యోగా చేయడం వారి ఆరోగ్య రీత్యా మంచిది కాదని NCERT అధికారి ఒకరు తెలిపారు. ఆరవ తరగతి నుంచి యోగా పై పాఠాలు చేర్చడంపైనే దృష్టి సారించినట్లు అధికారి వెల్లడించారు. ఉదాహరణకు ఆసనాలు వేయడం, ప్రాణాయం, మెడిటేషన్లాంటివి చేయించాలని...దీనికి ప్రత్యేకంగా ఓ పిరియడ్ కేటాయించాలని NCERT అధికారులు తెలిపారు.