చెన్నైలో కలకలం: కరుణానిధి ఇంట్లో ఆ‘గన్’తకుడి హల్ చల్
డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి ఇంట్లోకి ఓ ఆగంతకుడు తుపాకీతో చొరబడటానికి యత్నించడం కలకలం రేపింది. దుండగుడు తుపాకీ చూపించి కరుణానిధి సతీమణి రజతి అమ్మాల్ ను బెదిరించినట్లు సమాచారం.
చెన్నై: అన్నాడీఎంకే సంక్షోభంతో తమిళనాడు రాష్ట్రమంతటా వాడిగా వేడిగా రాజకీయ చర్చలు సాగుతుండగా.. హఠాత్తుగా డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి ఇంట్లోకి ఓ ఆగంతకుడు తుపాకీతో చొరబడటానికి యత్నించడం కలకలం రేపింది.
కరుణానిధి కుమార్తె కనిమొళి కూడా ఉంటున్న ఈ నివాసంలోకి ప్రవేశించిన దుండగుడు తుపాకీ చూపించి కరుణానిధి సతీమణి రజతి అమ్మాల్ ను బెదిరించినట్లు సమాచారం. ఆమె తెలివిగా అలారం మోగించడంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకుని రంగంలోకి దిగిన మైలాపూర్ పోలీసులు ఆ దుండగుడిని తమ అదుపులోనికి తీసుకున్నారు.
నిందితుడు బెంగళూరుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. ఇతడు ప్రస్తుతం ట్రిప్లేన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఈ ఘటన జరిగిన సమయంలో కనిమొళి కూడా ఇంట్లో లేరు.
ఆ సమయంలో ఓ సమావేశంలో ఉన్న ఆమె ఘటన గురించిన సమాచారం అందగానే హుటాహుటిన నివాసానికి చేరుకున్నారు. అతడు కరుణానిధి ఇంట్లోకి దొంగతనంగా ఎందుకు ప్రవేశించాడు, ఆయన సతీమణి రజతి అమ్మాల్ ను ఎందుకు బెదిరించాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేవలం దొంగతనం చేసేందుకు అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడా? మరేదైనా కారణం ఉందా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.