తప్పుడు అడ్రస్లు, రాంగ్ ఫోన్ నంబర్లు- యూకే ప్రయాణికుల గుర్తింపు కష్టతరం
బ్రిటన్ నుంచి వ్యాప్తిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ను గుర్తించేందుకు భారత్లో పలు రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. బ్రిటన్ నుంచి వైరస్ ముప్పున్న నేపథ్యంలో వారిని గుర్తించేందుకు కేంద్రం మార్గదర్శకాల మేరకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు నిరాశ తప్పడం లేదు. ఎందుకంటే వీరిలో చాలా మంది తప్పుడు అడ్రస్లు ఇవ్వడమో, రాంగ్ ఫోన్ నంబర్లు ఇవ్వడమో, అధికారులకు సహకరించకుండా తప్పించుకుని పారిపోవడమో చేస్తున్నట్లు తాజాగా నిర్ధారణ అయింది. దీంతో వీరి నుంచి ఎంతమందికి వైరస్ సోకుతుందో అర్దం కాని పరిస్ధితి.
బ్రిటన్ ప్రయాణికుల గుర్తింపు కష్టతరం..
బ్రిటన్ నుంచి భారత్కు కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయాందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి మన దేశానికి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేసింది. అయితే గత నెల 25 నుంచి ఈ నెల 23 వరకూ వచ్చిన ప్రయాణికులను కూడా గుర్తించి వారికి అవసరమైతే చికిత్స అందించాలని నిర్ణయించింది. ముందుగా వారిని గుర్తించాలని రాష్ట్రాలను కోరింది. అయితే ఇప్పటికే వేల మందిని గుర్తించిన పలు రాష్ట్రాలు మిగిలిన వారి విషయంలో మాత్రం చేతులెత్తేస్తున్న పరిస్ధితి నెలకొంది. ప్రస్తుతానికి విమాన యాన సంస్ధల నుంచి సేకరించిన డేటా ఆధారంగా మాత్రమే వీరిని గుర్తిస్తున్నారు.
రాంగ్ అడ్రస్లు, తప్పుడు ఫోన్ నంబర్లు
గత నెల 25 నుంచి ఈ నెల 23 వరకూ బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం మొదలు పెట్టాక వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఈ ప్రయాణికులు ఇచ్చిన భారత్లో అడ్రస్లు, ఫోన్ నంబర్లలో చాలా మటుకు తప్పుడువే అని తేలడం. మరికొందరు విమానాశ్రయాల్లో ప్రాధమిక పరీక్షలు నిర్వహించే లోపే తప్పించుకుని స్వస్ధలాలకు చేరుకున్నారు. ఇంకొందరు యూకే నంబర్లను కాంటాక్ట్గా ఇచ్చారు. వాటికి వాట్సాప్ కాల్స్ చేస్తున్నావారు లిఫ్ట్ చేయడం లేదని తేలింది. దీంతో వీరి గుర్తింపు కూడా కష్టంగా మారింది. భారత్లో ఇచ్చిన అడ్రస్లు కూడా తప్పుగా తేలడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు.
ఇక్కడే మిస్సింగ్లు ఎక్కువ
ఇలా బ్రిటన్ నుంచి వచ్చిన వారు తప్పుడు అడ్రస్లు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు లేక మిస్సయిన ఘటనలు పలు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. వీటిలో కర్నాటక, తెలంగాణ, పంజాబ్, ఒడిశాతో పాటు పలు రాష్ట్రాలున్నాయి. వీటిలో పంజాబ్ టాప్లో ఉంది. బ్రిటన్ నుంచి పంజాబ్కు వచ్చిన వారిలో అత్యధికంగా 3500 మంది ఇలా మిస్సయినట్లు అధికారులు తేల్చారు. కర్నాటకలో 2406 మంది బ్రిటన్ నుంచి రాగా వీరిలో 570 మంది చిరునామాలు దొరకడం లేదు. తెలంగాణకు వచ్చిన 1100 మందిలో 279 మంది ఇలా మిస్సయ్యారు. ఒడిశాకు వచ్చిన 181 మందిలో 30 మంది కనిపించడం లేదు. ఉత్తరాఖండ్కు వచ్చిన 227 మందిలో 20 మంది మాయమయ్యారు. దీంతో ఇప్పుడు వీరు ఎక్కడున్నారో తెలియక అధికారుల్లో టెన్షన్ పెరుగుతోంది.