వివేకానంద హత్య కేసు విచారణాధికారి అమిత్ గార్గ్ బదిలీ.. ఈ సమయంలోనే ఎందుకు..?
Recommended Video
అమరావతి: సీఎం జగన్ బాబాయ్ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసును మొదటి నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారి అమిత్ గార్గ్ కేంద్ర సర్వీసులకు బదిలీ చేశారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమిత్ గార్గ్ కేంద్ర సర్వీసులకు బదిలీ
2019 సాధారణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలుగు రాష్ట్రాల్లో సీఎం జగన్ బాబాయ్ మాజీ మంతి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. వైయస్ వివేకా హత్యకేసుకు సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అప్పటి టీడీపీ హయాంలో జరిగిన వివేకా హత్యపై బాబు సర్కార్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో సిట్ అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్ అమిత్ గార్గ్ను నియమించింది. ఇక రంగంలోకి దిగిన అమిత్ గార్గ్ విచారణ ప్రారంభించారు. అది జరుగుతుండగానే ఆయన్ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమిత్ గార్గ్ నేపథ్యం ఇదీ..
సిట్ అధికారిగా ఉన్న అమిత్ గార్గ్ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సహానీ ఉత్తర్వులు జారీ చేశారు. 1993 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అమిత్ గార్గ్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండగా ఆయన్ను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మెన్గా బదిలీ చేసింది ఏపీ సర్కార్. ఇప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మెన్ పదవి నుంచి కేంద్ర సర్వీసులకు బదిలీ చేసింది. ఇక ఐదేళ్ల పాటు ఆయన కేంద్ర సర్వీసులకు పరిమితం అవుతారు. ప్రస్తుతం అమిత్ గార్గ్ను సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడెమీకి ఐజీ స్థాయిలో జాయింట్ డైరెక్టర్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
సిట్ అధికారి మార్పుపై వివేకా కుమార్తె సునీత అభ్యంతరం
ఇక వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతా రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో సిట్ అధికారి అయిన అమిత్ గార్గ్ను తప్పించడాన్ని ఆమె తప్పుబడుతూ ఇదే విషయాన్ని తన పిటిషన్లో సైతం ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు లేదా నీరుగార్చేందుకు సిట్ను పలుమార్లు మారుస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు సిట్ చీఫ్గా అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్న వ్యక్తిని ప్రభుత్వం మారాకా డీఎస్పీ స్థాయికి మార్పు చేయడాన్ని ఆమె ప్రశ్నించారు. ఇదిలా ఉంటే తన తండ్రి హత్యకు సంబంధించి సీబీఐతో విచారణ జరిపించాలని సునీతా రెడ్డి కోరగా పలుమార్లు దీన్ని జగన్ సర్కార్ తిరస్కరించింది.
సీఐడీ చీఫ్గా పీవీ సునీల్ కుమార్
2019లో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత సిట్ అధికారిగా ఐపీఎస్ అమిత్ గార్గ్ను తప్పించడమే కాకుండా సీఐడీ నుంచి కూడా తప్పించడం జరిగింది. అమిత్ గార్గ్ స్థానంలో అదే 1993 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ పీవీ సునీల్ కుమార్ను సీఐడీ చీఫ్గా ప్రభుత్వం నియమించింది. ఆంధ్రప్రదేశ్లో నెలకొంటున్న రాజకీయ పరిణామాలతోనే అమిత్ గార్గ్ తప్పుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పలుమార్లు సిట్ మార్పులు జరుగుతుండటంతో మిస్టరీగా మారిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.