అవి ఆధారాలా?: ఈడీపై విరుచుకుపడ్డ చిదంబరం లాయర్ కపిల్ సిబల్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సోమవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ పిటిషన్ విచారించడం నిరుపయోగమని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో చిదంబరం తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆధారాలేవి?
కేసు విషయంలో చిదంబరాన్ని ఎలాంటి ప్రశ్నలు వేయకుండా సమాచారాన్ని లీక్ చేసి సంచలనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం నేరం చేశారంటున్న ఈడీ ఎలాంటి ఆధారాలను చూపడం లేదని అన్నారు. మొత్తం 26.5గంటలపాటు విచారించిన సీబీఐ.. చిదంబరాన్ని కేసుకు సంబంధించిన ప్రశ్నలు మాత్రం అడగలేదని ఆరోపించారు.
సంచలనం చేసేందుకే...
2018లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు మనం 2019 ఆగస్టులో ఉన్నాం. పిటిషనర్కు వ్యతిరేకంగా ఉన్న డాక్యుమెంట్లను సీల్డ్ కవర్లో న్యాయస్థానం ముందు ఉంచాలని సిబల్ వ్యాఖ్యానించారు. ప్రొసీడింగ్స్ను సంచలనం చేసేందుకు మీడియాకు లీకులు ఇస్తోందంటూ ఈడీపై సిబల్ మండిపడ్డారు. దర్యాప్తును మంత్రగత్తె వేట, మీడియా విచారణగా మార్చకూడదని వ్యాఖ్యానించారు.
కేసు డైరీలు ఆధారాలుగా పనికిరావు..
విచారణ సరైన మార్గంలో నడిచినప్పుడే కేసు డైరీలను కోర్టు ముందుంచాలని, కేసు డైరీలు ఆధారాలుగా పనికిరావని చిదంబరం న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. కస్టడీ రిమాండ్ కోరేందుకు ఇవి సరిపోవని వ్యాఖ్యానించారు.
సంచలనంగా మార్చేందుకా?
మీడియాకు కీలక సమాచారం ఇచ్చి ఐఎన్ఎక్స్ మీడియా కేసును సంచలనంగా మార్చేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈడీ అఫిడవిట్ను కూడా మీడియాకు లీక్ చేశారని కపిల్ సిబల్ మండిపడ్డారు. కోర్టుకు సమర్పించాల్సిన డాక్యుమెంట్లను మీడియాకు లీక్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
మూడేళ్లుగా అవే వాదనలు..
ఢిల్లీ హైకోర్టు జడ్జీ వద్ద నోట్స్, డాక్యుమెంట్లు, డైరీలే ఆధారాలుగా సమర్పించారని అన్నారు. విచారణ సందర్భంగా కూడా ఈ డాక్యుమెంట్లను చిదంబరంకు చూపించలేదని అన్నారు. ఎన్నో ఆస్తులు, ఎన్నో ఖాతాలు.. గత మూడేళ్లుగా తాను ఇలాంటి ఆరోపణలు వింటూనే ఉన్నానని అన్నారు. ఒక్క డాక్యుమెంట్ ను కూడా చిదంబరం ముందు ఉంచలేదని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.