ఐఎన్ఎక్స్ కేసు విచారణ ప్రశ్నల జాబితా ఇవ్వండి: చిదంబరం లాయర్ సిబల్ వాదన
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరంను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించిన ప్రశ్నలను రాతపూర్వకంగా సమర్పించాలని ఆయన తరపు న్యాయవాదులు మంగళవారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు ఆర్ బానుమతి, ఏఎస్ బోపన్న ఈ వాదనలు విన్నారు.
చిదంబరంను విచారిస్తున్న ఈడీ.. ఎలాంటి డాక్యుమెంట్లను కోర్టులో సమర్పించడం లేదని, కస్టడీకి మాద్రం అడుగుతోందని చిదంబరం తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఆరోపించారు. అంతేగాక, విచారణ సందర్భంగా కేసుకు సంబంధం లేని, అనవసర ప్రశ్నలు వేస్తున్నారని ఆయన తెలిపారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ కస్టడీకి కోరడం ఏంటని కపిల్ సిబల్ ప్రశ్నించారు. గత రెండేళ్లలో ఈడీ ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని వ్యాఖ్యానించారు. విచారణకు సహకరిస్తున్నప్పటికీ ఈడీ.. కస్టడీకి కోరాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
చిదంబరం ఆస్తులు ఖండాలు దాటాయి..
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆధారాలను తారుమారు చేసేందుకుక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం ప్రయత్నాలు చేస్తున్నారని ఈడీ ఆరోపించింది. అంతేగాక, విదేశాల్లోని ఆస్తులను అమ్మేస్తున్నారని, బ్యాంకు ఖాతాలను ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితోనే మూసివేయిస్తున్నారని ఈడీ పేర్కొంది.
చిదంబరం, అతని సహాయకులకు అర్జెంటీనా, బ్రిటీష్ వర్జిన్ ఐస్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, మలేషియా, మోనాకో, ఫిలిప్పీన్స్, సింగపూర్, సౌతాఫ్రికా, స్పెయిన్, శ్రీలంక దేశాల్లో ఆస్తులున్నాయని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి ఈ వివరాలను సేకరించినట్లు తెలిపింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆధారాలను ప్రభావితం చేసేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు చిదంబరం, ఆయనతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది.