ఐఎన్ఎక్స్ కేసుతో సంబంధం లేదు.. ఎఫ్ఐఆర్లో తన పేరు లేదు.. ఆజ్ఞాతం వీడిన చిదంబరం...
న్యూఢిల్లీ : సినిమా ట్విస్టులను తలదన్నిన ఐఎన్ఎక్స్ ఎపిసోడ్ ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చింది. నిన్నటి నుంచి నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రత్యక్షమయ్యారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ నోటీసులు, లుక్ ఔట్ నోటీసులు జారీచేయడంతో ఉత్కంఠ నెలకొన్నది. దీంతో నిన్నటి నుంచి చిదంబరం ఆజ్ఞాతంలో ఉన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ లభించకపోవడంతో .. చివరికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు చిదంబరం. ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
సంబంధం లేదు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, చార్జీషీట్లో తనపేరు లేదని పేర్కొన్నారు. ముడుపులకు సంబంధించి ఆరోపణలు లేవని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఘటనలో తనను ఇరికించడం ఏంటీ అని ప్రశ్నించారు. ఈ కేసులో తనకు నోటీసులు ఇవ్వడంపై నిన్నటి నుంచి తన లాయర్లతో సంప్రదింపులు జరిపానని పేర్కొన్నారు. తానేం తప్పుచేయలేదని .. ఎవరికీ భయపడబోనని తేల్చిచెప్పారు. ఓ పౌరుడిగా తిరిగే అధికారం తనకు ఉందని వివరించారు. చట్టాన్ని గౌరవిస్తానని .. దర్యాప్తు సంస్థలు కూడా చట్టాన్ని గౌరవించాలని కోరారు.
ఆజ్ఞాతం వీడిన చిదంబరం.. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షం
రంగంలోకి సీబీఐ
ఇదిలాఉంటే చిదంబరం ప్రెస్ మీట్తో సీబీఐ అధికారులు అలర్టయ్యారు. ఆయనను అరెస్ట్ చేసుందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయనికి బయల్దేరారు. సీబీఐ అధికారుల రాకతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. మరోవైపు సీబీఐ అధికారుల రాకతో అక్కడ ఉత్కంఠ సిచుయేషన్ నెలకొంది.
హైకోర్టు .. సుప్రీంకోర్టు .. టు కాంగ్రెస్ కార్యాలయం ...
చిదంబరం బెయిల్ పిటిషన్కు సంబంధించి ఇవాళ ఉదయం నుంచి చకచకా పరిణామాలు జరిగిపోయాయి. తొలుత జస్టిస్ ఎన్వీ రమణ విచారణ చేపట్టి .. సీజేఐ రంజన్ గొగొయ్కు అప్పగించారు. ఆయన విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. దీంతో ఉత్కంఠగా మారింది. చిదంబరం తరఫు న్యాయవాదులు కపిల్ సిబల్ అండ్ కో సుప్రీంకోర్టులోనే ఉండి .. పిటిషన్ అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఇవాళ అయోధ్య కేసు విచారణ ఉండటంతో సీజేఐ రంజన్ గొగొయ్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టబోమని సంకేతాలిచ్చారు. అయితే కపిల్ సిబల్ బృందం మాత్రం తమ పిటిషన్ విచారించాలని సుప్రీంకోర్టు రిజిస్టార్ను కోరారు. వారి వినతిని పరిశీలనలోకి తీసుకున్న రిజిస్టార్ .. కేసు విచారణ గురించి సుప్రీంకోర్టు సీజేఐకి తెలిపి .. తేదీ తీసుకున్నారు. చిదంబరం పిటిషన్ను శుక్రవారం విచారిస్తామని రిజిస్టార్ కపిల్ సిబల్ బృందానికి తెలిపారు. దీంతో రెండురోజుల సమయం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. చివరికి చిదంబరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షం అవడంతో .. సీబీఐ అధికారులు బయల్దేరారు. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.