ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీకి ఎదురుదెబ్బ: చిదంబరం అరెస్టుపై ఆదేశాలు ఇవ్వని కోర్టు..రిజర్వ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థిక, హోం శాఖల మాజీ మంత్రి పీ చిదంబరానికి తొలిసారిగా ఊరట లభించేలా కనిపిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసు వ్యవహారంలో చిదంబరాన్ని అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాఖలు చేసుకున్న పిటీషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచింది ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం. మంగళవారం తన తీర్పును వెలువడించే అవకాశం ఉంది. చిదంబరం తరఫున ఆయన కేసును వాదిస్తోన్న తోటి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించినట్టయింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేస్ అప్డేట్స్: బెయిల్ కోసం సుప్రీం తలపులు తట్టిన చిదంబరం
ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ అధికారులను చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను తీహార్ జైలులో ఉంచి, విచారణ కొనసాగిస్తున్నారు. అదే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని అరెస్టు చేయడానికి తమకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ ఈడీ అధికారులు కొద్దిరోజుల కిందటే ప్రత్యేక న్యాయస్థానానికి పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. సోమవారం వాదనలను చేపట్టింది. చిదంబరం తరఫున కపిల్ సిబల్ తన వాదనలను వినిపించారు.చిదంబరాన్ని ఇదివరకే సీబీఐ అరెస్టు చేసి, విచారణ కొనసాగిస్తోందని, అలాంటప్పుడు అదే కేసులో ఈడీ ఎలా అరెస్టు చేస్తుందని వాదించారు.
40 రోజుల పాటు సీబీఐ అధికారులు చిదంబరాన్ని విచారిస్తున్నారని, రెండుసార్లు కస్టడీని పొడిగించారని గుర్తు చేశారు. అయినప్పటికీ.. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో చిదంబరం అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటిదాకా కూడా ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా సేకరించలేకపోయారని కపిల్ సిబల్ వాదించారు. దీనిపై ఈడీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత.. తీర్పును రిజర్వ్ లో ఉంచింది ప్రత్యేక న్యాయస్థానం. మంగళవారం తీర్పును వెలువరించే అవకాశం ఉంది.