90 రోజులుగా జైల్లోనే: బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు చిదంబరం
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ పిటిషన్ వేశారు.
విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారణకు అంగీకరించింది. గత 90 రోజులుగా చిదంబరం జైల్లోనే ఉన్నారని వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని చిదంబరం తరపున కోరారు.
దీనిపై విచారించిన జస్టిస్ బోబ్డే మంగళవారం లేదా బుధవారం విచారిస్తామని స్పష్టం చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అరెస్టైన చిదంబరం బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించిన విషయం తెలిసిందే.
అలాగే కస్టడీని పొడిగించాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ ను ఆమోదిస్తూ నవంబర్ 27 వరకు చిదంబరం జుడీషియల్ రిమాండ్ ను పొడిగించింది.
కాగా, ఈ నేపథ్యంలో ఆయన సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చిదంబరం అరెస్ట్ కూడా గందరగోళం మధ్య సాగిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారులు ఆయన కోసం నిఘా పెట్టిమరీ అదుపులోకి తీసుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో రూ. 305 కోట్ల నిధులు అక్రమమార్గంలో ఐఎన్ఎక్స్ మీడియాకు వెళ్లేందుకు చిదంబరం కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి.
2017లో చిదంబరంపై మనీలాండరింగ్ కేసులో అభియోగాలు నమోదు చేసింది ఈడీ. మనీలాండరింగ్ కేసును సీబీఐ కూడా విచారిస్తోంది. ఆగస్టు 21న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను సీబీఐ మొదటిసారి అరెస్ట్ చేసింది.