ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీ తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం అనుమతిచ్చింది. ప్రొడక్షన్ వారెంట్ ఇవ్వాలంటూ ఈడీ గత శుక్రవారం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఐఎన్ఎస్ మీడియాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో పీ చిదంబరంను కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు వివరించింది దర్యాప్తు సంస్థ ఈడీ. కాగా, ఐఎన్ఎక్స్ మీడియా కేసు విచారిస్తున్న సీబీఐ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీ చిదంబరంను ఆగస్టు 21న అదుపులోకి తీసుకుంది .
ఆ తర్వాతి రోజు నుంచి సీబీఐ కస్టడీలో ఉన్న చిదంబరంను సెప్టెంబర్ 5న తీహార్ జైలుకు జుడీషియల్ కస్టడీకి పంపారు. క్రమంగా గడువు తేదీని పెంచుకుంటూ అక్టోబర్ 17 వరకు జుడీషియల్ కస్టడీ కొనసాగింది. ఈ క్రమంలో ఈడీ చిదంబరంను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది.
17 బ్యాంక్ ఖాతాలతోపాటు విదేశాల్లోని పలు షెల్ కంపెనీల గురించిన సమాచారాన్ని చిదంబరం నుంచి రాబట్టాల్సి ఉన్నందున.. ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. చిదంబరంను ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు చేసింది.
కాగా, ఐఎన్ఎక్స్ మీడియా సంస్థపై 2017, మే15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా, ఐఎన్ఎక్స్ ప్రెస్, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన ఆధ్వర్యంలో పనిచేసిన చెస్ మెనేజ్మెంట్ సర్వీసెస్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతోపాటు మరికొందర్ని సీబీఐ ఈ కేసులో నిందితులుగా పేర్కొంది.