చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ మీడియా ఉచ్చు: మళ్లీ కస్టడీ పొడిగింపు..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థికం, హోమ్ శాఖల మాజీ మంత్రి పీ చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. బెయిల్ మంజూరు చేయాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటీషన్ ను న్యూఢిల్లీలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానం తిరస్కరించింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు రోజ్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ కుహర్ ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా- కస్టడీ ముగిసేంత వరకూ ఆయన తీహార్ జైలులోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో పీకల్లోతు: చిదంబరంపై ఛార్జిషీట్: ఆయన కుమారుడితో సహా 13 మంది!
ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపై చిదంబరం అరెస్టయిన విషయం తెలిసిందే. అక్రమంగా విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కార్యాలయం అధికారులు ఆగస్టు 5వ తేదీన ఆయనను అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. విచారణ సందర్భంగా చిదంబరాన్ని తీహార్ జైలులో ఉంచారు. అక్కడే విచారణను కొనసాగిస్తున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి కేటాయించే ఏడో నంబర్ కాంప్లెక్స్ లో విచారణను ఎదుర్కొంటున్నారు చిదంబరం.
నిజానికి- ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసులో చిదంబరానికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. రెండున్నర లక్షల రూపాయల పూచీకత్తుపై సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ రాలేదు. కస్టడీలోనే కొనసాగుతున్నారు. ఈడీ నమోదు చేసిన కేసులోనూ బెయిల్ కోసం చిదంబరం తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నప్పటికీ.. సాధ్యం కావట్లేదు. ఈ నెల 27వ తేదీ వరకు కస్టడీలో కొనసాగాల్సి ఉంటుంది.