చిదంబరం కస్టడీ పొడిగింపు: తీహార్ జైలులో వెస్టర్న్ టాయ్ లెట్, ప్రత్యేక సెల్..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియాలో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఆయన కస్టడీని వచ్చే నెల 13వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ కుహర్ ఆదేశాలు జారీ చేశారు. మరో రోజు చిదంబరం కస్టడీని పొడిగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం అధికారులు దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ట్విస్ట్: చిదంబరం సాక్ష్యాలను ధ్వంసం చేశారన్న సీబీఐ
ఈ నేపథ్యంలో- వచ్చే నెల 13వ తేదీ వరకు చిదంబరం తీహార్ కేంద్ర కారాగారంలోనే గడపాల్సి వచ్చింది. ఇదివరకు కంటే కొన్ని అదనపు సౌకర్యాలను కల్పించడానికి న్యాయమూర్తి అంగీకరించారు. తీహార్ జైలులో చిదంబరానికి ప్రత్యేక సెల్ ను కేటాయించాలని సూచించారు. ఆయన వయస్సు, వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని సకాలంలో మందులను అందించాలని ఆదేశించింది. ఇదివరకు కోరుకున్నట్టుగా వెస్టర్న్ టాయ్ లెట్ సౌకర్యాన్ని కల్పించేలా చర్యలు వెంటనే తీసుకోవాలని న్యాయమూర్తి తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునే వెసలుబాటును ఇదివరకే ఆయనకు కల్పించారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ కస్టడీని చిదంబరానికి ఊరట లభించిన విషయం తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన కేసు విచారణ నుంచి చిదంబరానికి బెయిల్ ను మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇదే కేసులో ఈడీ అధికారులు దాఖలు చేసిన కేసు నుంచి మాత్రం ఆయనకు ఊరట లభించట్లేదు. కస్టడీ ముగిసిన ప్రతీసారి దాన్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ అవుతున్నాయి. దీనిపై చిదంబరం తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సీబీఐ నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీని పిటీషన్ కు జత చేశారు. ఢిల్లీ హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది.